వీరవాసరం : నాటకరంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు కోరారు. వీరవాసరం కళాపరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అఖిలభారత స్థాయి నాటిక పోటీల్లో పాల్గొని శనివారం ఆయన మాట్లాడారు. నాటకాల ద్వారా సమాజానికి ఉపయోగపడే సందేశాత్మక అంశాలు ఎన్నో మిళితమై ఉంటాయన్నారు. నాటక ప్రదర్శనలకు థియేటర్లు ఏర్పాటు చేసి కళాకారులకు, కళాభిమానులను ప్రోత్సహించాలన్నారు. ఎంతో మంది కవులు, కళాకారులను, న్యాయ నిపుణులను ఏటా సన్మానించడం, నిర్విరామంగా పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. రాష్ట్ర సమాచారహక్కు చట్టం కమిషనర్ లామ్ తాంతియాకుమారి, రిటైర్డ్ డెప్యూటీ హైకోర్టు రిజిస్ట్రార్ పాలకోడేటి కృష్ణమూర్తిలను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో కళాపరిషత్ అధ్యక్షుడు గుండా రామకృష్ణ, వైసీపీ మండల కన్వీనర్ కోటిపల్లిబాబు, పట్టణాధ్యక్షుడు నూకల కనకారావు, ఎంపీటీసీలు చికిలే మంగతాయారు, రెడ్డి రాంబాబు, పాలా లక్ష్మీకుమారి, మోగంటి నాగేశ్వరరావు, ఆవాల కనకదుర్గ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాసవర్మ, కామన నాగేశ్వరరావు, ఎస్వీ రంగారావు పాల్గొన్నారు.