పాలకులకు మంచి బుద్ధి కలగాలి

1 Jan, 2017 23:22 IST|Sakshi
పాలకులకు మంచి బుద్ధి కలగాలి

పెనుకొండ : సంక్షేమ పథకాలను టీడీపీ నాయకులే దోచుకుంటున్నారని, పేదవాడికి అన్యాయం జరుగుతోందని, ఈ ఏడాదైనా పాలకులకు మంచి బుద్ధి ప్రసాదించాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకరనారాయణ అన్నారు. ఆదివారం  పట్టణంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో 2017 నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిపారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ పథకాలు టీడీపీవారే దోచుకుంటున్నారని,    పేదవాడికి అందని పరిస్థితి నెలకొందన్నారు. ఈ ఏడైనా టీడీపీ ప్రజాప్రతినిథులకు మంచి బుద్ధి ప్రసాదించాలని ఆయన కోరుకున్నారు. రెండున్నరేళ్లలో టీడీపీ ప్రజావ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతూ ప్రజల ఆశలను అడియాశలు చేసిందన్నారు.

గడపగడపకూ వైఎస్సార్‌సీపీలో ఎక్కడకెళ్లినా పింఛన్లు, రేషన్‌కార్డులు, ఉపాధి బిల్లులు అందలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. సీఎం చంద్రబాబునాయుడు సంక్రాంతికి నియోజకవర్గానికి 2 వేల పింఛన్లు ఇస్తామంటున్నారని, నిజమైన పేదలకు పింఛన్లు అందించాలన్నారు. పోలవరం జాతీయ హోదా కలిగిన ప్రాజెక్టు అని దానికి రాష్ట్ర ప్రభుత్వం కమీషన్ల కోసం నిర్మాణ భారాన్ని మీద వేసుకుని బినామీ కాంట్రాక్ట్‌ సంస్థల ద్వారా దోపిడీకి కార్యాచరణ సిద్ధం చేసిందన్నారు.రూ.16 వేల కోట్ల అంచనా వ్యయం ఉన్న ప్రాజెక్టును రూ.40 వేల కోట్లకు ఎందుకు పెంచినట్లో ప్రజలకు ప్రభుత్వం వివరణ ఇవ్వాలన్నారు. పోలవరం ప్రాజెక్టు వైఎస్‌ఆర్‌ చలువతోనే ప్రారంభమైందన్నారు.

మరిన్ని వార్తలు