మరణంలోనూ వీడని బంధం..

26 Feb, 2016 22:27 IST|Sakshi

కరీంనగర్ : మూడుముళ్లు... ఏడుడగుల బంధంతో ఏకమైన దంపతులు కడదాకా కలిసే పయనించారు. అనారోగ్యంతో మంచం పట్టిన భర్త.. గుండెపోటుతో చికిత్స పొందుతున్న భార్య.. ఇద్దరూ కొన్ని గంటల తేడాలో మృతిచెందిన ఘటన కరీంనగర్ జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే...ఎల్లారెడ్డిపేట మండలం కోరుట్లపేటకు చెందిన గండ్ర గోవిందరావు(95), సత్తమ్మ (85) దంపతులు. గోవిందరావు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. భర్తకు సేవచేస్తూ అతనికి తోడుగా ఉన్న సత్తమ్మ వారంరోజుల క్రితం గుండెపోటుకు గురైంది. వెంటనే కుటుంబసభ్యులు ఆమెను చికిత్సకోసం హైదరాబాద్కు తరలించారు. ఈక్రమంలో గోవిందరావు శుక్రవారం ఉదయం మృతి చెందాడు. ఆయన మరణించిన కొద్ది గంటల్లో హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న సత్తమ్మ కూడా కన్నుమూశారు. భార్యాభర్తలు ఇద్దరు ఒకేరోజు మృతిచెందడంతో బంధువులు, కుటుంబసభ్యులు కన్నీళ్ల పర్యంతమయ్యారు. సత్తమ్మ మృతదేహాన్ని కోరుట్లపేటకు తీసుకువచ్చి దంపతులిద్దరినీ ఒకే చితిపైన ఉంచి అంత్యక్రియలు జరిపారు.

మరిన్ని వార్తలు