చదువులమ్మ చెట్టు నీడలో..

10 Jul, 2017 00:01 IST|Sakshi
చదువులమ్మ చెట్టు నీడలో..
పూర్వ విద్యార్థుల సమ్మేళనం
రాజమహేంద్రవరం రూరల్‌: ఇరవై ఏళ్ల క్రితం బొమ్మూరులోని జిల్లావిద్యాశిక్షణ కేంద్రం (డైట్‌)లో ఛాత్రోపాధ్యాయులుగా శిక్షణ పొంది... ఇప్పుడు ఉపాధ్యాయులుగా స్థిరపడిన 1997–98 బ్యాచ్‌ విద్యార్థులు ‘స్నేహ గౌతమి’పేరుతో పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం చదువులమ్మ చెట్టునీడలో ఉల్లాసంగా .. ఉత్సాహంగా జరుపుకున్నారు. తమకు విద్యాబుద్దులు నేర్పించిన ఉపాధ్యాయులను గురుపౌర్ణమి సందర్భంగా ఘనంగా సత్కరించారు. ఆనాడు తమకు లెక్చరర్‌గా ఉన్న అప్పారి జయప్రకాశరావు నేడు డైట్‌ కళాశాలకు ప్రిన్సిపాల్‌గా ఉండడం ఆనందంగా ఉందని స్నేహ గౌతమి అధ్యక్షుడు ఐ.మోహన్‌ అన్నారు. ఇక్కడ శిక్షణ పొందిన వారంతా ఉభయగోదావరి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నామని సభకు పరిచయం చేసుకున్నారు. అలనాటి తీపి గుర్తులను జ్ఞాపకం చేసుకోవడంతో అప్పటి చిలిపి పేరులతో పిలుచుకుంటూ  స్నేహమాధుర్యాన్ని ఒకరికొకరు పంచుకున్నారు. తమకు బోధించిన గురువులు అప్పారి జయప్రకాశరావు, గంగారాం, బాలచందర్, ఈవీఎస్‌.జ్యోతి, కేవీ రమణ, గోవిందు, వై.నాగేశ్వరరావు, ఆర్‌.నాగేశ్వరరావు, ఐజీహెచ్‌ఎన్‌.ప్రసాద్, వీవీఎన్‌ ఆచార్యులు, బి.వెంకట్రావు, అన్నాజీరావులను ఘనంగా సత్కరించారు. పూర్వ విద్యార్థులను ఉద్ధేశించి డైట్‌ ప్రిన్సిపాల్‌ జయప్రకాశరావు మాట్లాడుతూ తమ వద్ద ఉపాధ్యాయ శిక్షణ పొంది, ఉపాధ్యాయులుగా పనిచేస్తూ 20 ఏళ్ల తరువాత స్నేహగౌతమి పేరుతో కలుసుకుని గురుపౌర్ణమి రోజున సత్కరించడం చాలా ఆనందరంగా ఉందన్నారు. టి.బంగారునాయుడు, కెఎస్‌.మల్లేశ్వరరావు, భమిడిపాటిఫణికుమార్, సత్తిబాబు, సూర్యకిరణ్, కృష్ణంరాజు, కవిత, నాగమణి తదితరులు పాల్గొన్నారు. 
మరిన్ని వార్తలు