కారు అదుపుతప్పి ఒకరు మృతి

12 Aug, 2016 19:05 IST|Sakshi
కారు అదుపుతప్పి ఒకరు మృతి
వల్లభాపురం (చివ్వెంల) : అతివేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొట్టడంతో ఓ వ్యక్తి మృతిచెందగా, నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మండలంలోని వల్లభాపురం గ్రామ శివారులోని జగన్నాయక్‌తండా వద్ద శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాష్ట్ర రాజధాని నగరంలోని హైటెక్‌ సిటీలో ప్రైవేటు ఉద్యోగులుగా పనిచేస్తున్న నగరవాసులు ఎలిమిలేటి అభిషేక్‌ (26), వి.విక్రమ్, ఆకుల అరుణ్, మారినేని సుధీర్, ఫణీ శుభకార్యం నిమిత్తం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు స్కోడా కారులో వెళ్తున్నారు. ఈ క్రమంలో మండల పరిధిలోని వల్లభాపురం గ్రామ శివారులో హైదరాబాద్‌–విజయవాడ హైవేపై వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొట్టడంతో డ్రైవింగ్‌ చేస్తున్న అభిషేక్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో ఉన్న నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని వెంటనే సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. వీరిలో సుధీర్, విక్రమ్‌ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ తరలించారు. సంఘటనాస్థలాన్ని హెడ్‌కానిస్టేబుల్‌ చిత్తలూరి భిక్షంగౌడ్‌ సందర్శించి పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.
 
మరిన్ని వార్తలు