సమస్యలకు నిలయం పెద్దాస్పత్రి

1 Mar, 2017 04:04 IST|Sakshi

► పనిచేయని లిఫ్టులు..  గోడలపై గుట్కా మరకలు
►  ముక్కు మూసుకోనిదే నోఎంట్రీ


ఎదులాపురం: జిల్లా కేంద్రంలోని పెద్దాస్పత్రి అయిన రిమ్స్‌ సమస్యలకు నిలయంగా మారింది. చెత్త కుండీల్లో చెత్త పేరుకుపోవడంతో దుర్గంధం వెదజల్లుతోంది. దీంతో ముక్కు మూసుకోనిదే ఆస్పత్రిలోనికి వెళ్లే పరిస్థితి లేదు. ఆస్పత్రిలో లిఫ్టులు పనిచేయకపోవడంతో రక్త పరీక్షలు, స్కానింగ్, ఎక్స్‌రే, ఇతర పరీక్షల కోసం రోగులను పైఅంతస్తు నుంచి కిందికి, కింది నుంచి పైఅంతస్తుకు తీసుకెళ్లాలంటే అవస్థలు ఎదురవుతున్నాయి. కొన్ని వార్డుల్లో గోడలు, మెట్లపై గుట్కా మరకలు దర్శనమిస్తున్నాయి. ఆయా వార్డుల్లోని కిటికీలకు అట్ట ముక్కలతో తాత్కాళికంగా తలుపులు అమర్చారు. అపరిశుభ్ర వాతారణం కారణంగా రోగుల వెంబడి వచ్చే వారు రోగాల బారిన పడే అవకాశాలు లేకపోలేదు.

పనిచేయని లిఫ్ట్‌లు
రిమ్స్‌ ఆస్పత్రిలో మొత్తం నాలుగు లిఫ్ట్‌లు ఉన్నాయి. అందులో మూడు పనిచేయడం లేదు. ఒక లిఫ్ట్‌ మాత్రమే పనిచేస్తుండటం, నాలుగు లిఫ్ట్‌లలో నుంచి ఏ లిఫ్ట్‌ ఎప్పుడు పనిచేస్తుందో సిబ్బందికే తెలియదంటే ఇక పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. పై అంతస్తుల్లో చికిత్స పొందుతున్న రోగులైతే రోజుకోసారైనా పరీక్షల నిమిత్తం కిందికి దిగాల్సి ఉంటుంది. దీంతో వారు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. కనీసం రోగులను తీసుకెళ్లే విధంగానైనా లిఫ్ట్‌లను అందుబాటులోకి తీసుకురావాలని రోగుల బంధువులు కోరుతున్నారు.

గోడలు, మెట్లపై గుట్కా మరకలు
పలు వార్డుల్లోని గోడలు, మూలలు, మెట్లపై గు ట్కా మరకలు దర్శనమిస్తున్నాయి. గతంలో ఆ స్పత్రిలోనికి వెళ్లేవారిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన సెక్యూరిటీ సిబ్బంది ఇప్పుడు పట్టించుకోవడం లేదు. ప్రజలను తనిఖీ చేసి మరీ వారి వద్ద ఉన్న గుట్కాలు, అంబర్‌ లాంటి మత్తు పదార్థాలను లోనికి అనుమతించలేదు. దీంతో ఆ సమయ ంలో ఇలాంటివి చోటుచేసుకోలేదు. ప్రస్తు తం గోడలు మరకలతో నిండుగా కనిపిస్తున్నాయి.

వెదజల్లుతున్న దుర్గంధం
ఆస్పత్రిలో ఎటు వెళ్లినా దుర్గంధం వెదజల్లుతోంది. మరుగుదొడ్లను శుభ్రం చేయకపోవ డం, రోజుల తరబడి చెత్తాచెదారం నిల్వ ఉండడంతో ఈ దుస్థితి నెలకొంది. నిత్యం వందల సంఖ్యలో వచ్చే ప్రజలు దుర్వాసనతో ఇబ్బ ందులు ఎదుర్కొంటున్నారు. నోటిపై గుడ్డను అడ్డుగా పెట్టి ఆస్పత్రిలోనికి వెళ్తున్నారు.

మరిన్ని వార్తలు