పుష్కర అధికారిగా వికాస్‌ రాజ్‌

20 Jul, 2016 01:55 IST|Sakshi
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: వచ్చే నెలలో జరుగనున్న కృష్ణా పుష్కరాల కోసం నిర్వహిస్తున్న పనులను పర్యవేక్షించేందుకు గాను ఐఏఎస్‌ అధికారి వికాస్‌రాజ్‌ను జిల్లా ప్రత్యేక అధికారిగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ ఉత్తర్వుల ప్రకారం పుష్కర భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పుష్కరాల నిర్వహణను వికాస్‌రాజ్‌ పర్యవేక్షిస్తారు. ఈ పుష్కరాల కోసం జరుగుతున్న ప్రత్యేక పనులను, ఇతర ఏర్పాట్లను కూడా ఆయన ఎప్పటికప్పుడు జిల్లా అధికారులతో సమీక్షిస్తారు. 1992 బ్యాచ్‌కు చెందిన వికాస్‌రాజ్‌ ప్రస్తుతం చిన్న నీటిపారుదల శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. 
పుష్కరాల జిల్లా ప్రత్యేక అధికారిగా నియమితులయిన వికాస్‌రాజ్‌ గురువారం జిల్లాకు రానున్నారు. జిల్లాకు వచ్చిన వెంటనే పుష్కర పనులపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి అనంతరం వాడపల్లికి వెళతారని, అక్కడ జరుగుతున్న పుష్కర పనులను పరిశీలిస్తారని సమాచారం. 
 
మరిన్ని వార్తలు