‘బాబు పాలన అవినీతిమయం’

9 Jun, 2017 22:53 IST|Sakshi

కూడేరు : సీఎం చంద్రబాబు మూడేళ్ల పాలనలో అవినీతి, అక్రమాలు విపరీతంగా పెరిగిపోయాయని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ మంత్రి శైలజనాథ్‌ అన్నారు. శుక్రవారం కూడేరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలకు మూడేళ్లలో ఏం చేశారని విజయోత్సవాలు జరుపుకుంటున్నారని ప్రశ్నించారు. మూడేళ్లలో భూకబ్జాలు, ఇసుక దోపిడీలు అధికమైయ్యాయని మండిపడ్డారు. ఉపాధి హామీ పథకం కింద కొన్ని పనులు చేయకనే చేసినట్టు చూపించి ఎమ్మెల్యేలు, టీడీపీ నాయకులు నిధులను  నొక్కేస్తున్నారని ఆరోపించారు. అధికారం చేపట్టినప్పటి నుంచి గ్రామీణ ప్రాంతాల్లో ఒక్క పక్కా ఇంటిని కూడా నిర్మించింది లేదన్నారు.

సీఎం మాత్రం హైదరాబాద్‌లో ఇంటిని నిర్మించుకుని దానిని పార్టీ క్యాంపు కార్యాలయంగా ఏర్పాటు చేసుకున్నారని విమర్శించారు. జిల్లాలో కరువును రూపుమాపుతానని సీఎం జిల్లాకు వచ్చినపుడల్లా ప్రకటనలు చేయడం తప్పా చేసింది ఏమి లేదన్నారు.  కూడేరు మండలం పీఏబీఆర్‌ డ్యాం వద్ద రూ.56 కోట్లతో నిర్మించిన తాగునీటి ప్రాజెక్ట్‌ను ప్రారంభించకుండా రాజకీయం చేస్తున్నారన్నారు.  సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సుధాకర్, పీసీసీ అధికార ప్రతినిధి రమణ,  కార్యదర్శి  జయచంద్రనాయుడు, జిల్లా ఎస్సీ సెల్‌ చైర్మన్‌ విష్ణునారాయణ, మండల కన్వీనర్‌ ఆంజనేయులు, మండల నాయకులు రంజిత్, జనార్దన్, రమణ, అక్కులప్ప తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు