'సారీ అమ్మా.. నీ పేరు నిలబెట్టలేకపోయా..'

19 Sep, 2015 15:11 IST|Sakshi
'సారీ అమ్మా.. నీ పేరు నిలబెట్టలేకపోయా..'

నకిరేకల్: బీటెక్ మూడో సంవత్సరంలో నిర్దేశిత ప్రమాణాలను చేరుకోలేకపోయిన ఓ విద్యార్థిని మానసిక వేదనతో ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు, మృతురాలి బంధువుల కథనం మేరకు.. నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలానికి చెందిన రొట్టెల స్వాతి హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌లో బ్రిలియంట్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. అయితే, మూడో ఏడాదిలో ఆమెను కళాశాల డిటెయిన్డ్ చేసింది.

దీంతో తాను ఫెయిల్ అయినట్టేనని, అమ్మా, నాన్నలకు ముఖం చూపించుకోలేనని మనస్తాపం చెందిన స్వాతి నకిరేకల్ మండలం కడపర్తి గ్రామంలోని అమ్మమ్మ వాళ్లి ఇంటికి వచ్చి, శుక్రవారం రాత్రి ఫ్యాన్‌కు ఉరేసుకుంది. చనిపోయే ముందు స్వాతి రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. 'సారీ అమ్మా నేను కాలేజీ డిటెంట్ అయ్యాను. అంటే ఫెయిల్ చేస్తారు. నీ పేరు నిలబెట్టలేకపోయాను అమ్మా, మీరు బాగుండాలి. తమ్ముళ్లను బాగా చదివించు అమ్మా' అంటూ సూసైడ్ నోట్‌లో స్వాతి రాసింది.

మరిన్ని వార్తలు