- ప్రధానిని కోరిన కర్నూలు ఎంపీ బుట్టా రేణుక
కర్నూలు(ఓల్డ్సిటీ): చేనేత కార్మికులకు చేయూతనిచ్చి ఆత్మహత్యలు నివారించాలని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక ప్రధాని మోదీని కోరారు. చేనేతలు ఎదుర్కొంటున్న సమస్యలను పార్లమెంటులో ప్రధానితోపాటు జౌళిశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు గురువారం ఎంపీ కార్యాలయం నుంచి ప్రకటన ఇచ్చారు. ఒక్క కర్నూలు నియోజకవర్గంలోనే సుమారు 2 లక్షల మంది చేనేత కార్మికులున్నారని, పేదరికం కారణంగా వారు ఉత్పత్తి చేసిన వస్తువులను మార్కెటింగ్ చేసుకోలేక, గిట్టుబాటు ధరలు పొందలేక దుర్భర పరిస్థితిని అనుభవిస్తున్నారని ఎంపీ సభ దృష్టికి తీసుకెళ్లారు.
చేనేత వస్త్రాలను నేషనల్ టెక్స్టైల్స్ కార్పొరేషన్ ద్వారా మార్కెటింగ్ చేసుకునే వెసులుబాటు కల్పించి, ఆధునిక పరికరాలు వాడే విధంగా ప్రోత్సాహం అందించాలని కోరారు. చేనేతలకు గృహంతో కూడిన వర్క్షెడ్ నిర్మాణ పథకం వర్తింపజేయాలన్నారు. ఎంఎన్ఆర్జీఈఏతో పాటు ఇతర పథకాలను అమలు చేయాలని, పేదరికం నుంచి విముక్తి కల్పించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ఎంపీ బుట్టా రేణుక పార్లమెంటులో ప్రధాని, మంత్రిని కోరారు.