బురదగుంతే పట్టించింది!

6 Jul, 2016 02:16 IST|Sakshi
బురదగుంతే పట్టించింది!

అద్దె కారులో వచ్చిన రూపేశ్‌కుమార్ మోహనాని
తీవ్ర కలకలం రేపిన ఘటన
‘మదన్‌పల్లి’ ఘటన.. కారు బురదలో ఇరుక్కోవడంతో పట్టుబడిన నిందితుడు

శంషాబాద్ రూరల్: అమావాస్య రోజు.. రాత్రి వేళ.. ఊరి పొలిమేరలో మంటలు చెలరేగడం ఆ గ్రామస్తుల్లో అనుమానాలు రేకెత్తించింది. సంఘటనా స్థలానికి వెళ్లి చూస్తే అక్కడ ఓ మృతదేహం తగులబడుతుండడంతో ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. మండల పరిధిలోని మదన్‌పల్లి వద్ద నగరానికి చెందిన రూపేశ్‌కుమార్ మోహనాని సోమవారం రాత్రి తన భార్య మృతదేహాన్ని కాల్చివేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అతడు పరారవుతుండగా కారు బురదలో ఇరుక్కుపోవడంతో రూపేశ్‌కుమార్ గ్రామస్తులకు పట్టుబడ్డాడు. జాతీయ రహదారికి సుమారు కిలోమీటరు దూరంలో మృతదేహాన్ని కాల్చి వేయగా.. అక్కడ నుంచి  రహదారిపైకి చేరుకోవడానికి మరో మార్గం ఉన్నప్పటికీ..

చీకట్లో దారి తెలియక నిందితుడు వచ్చిన దారిలోనే వెళ్తుండగా కారు బురదగుంతలో ఇరుక్కుపోయింది. ఒకవేళ వేరే మార్గంలో వెళ్తే నిందితుడు సులువుగా తప్పించుకునే అవకాశం ఉండేది. కాని, అప్పటికే గ్రామస్తులు అప్రమత్తం కావడం.. నిందితుడి కదలికలపై అనుమానాలు రావడంతో దొరికిపోయాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఒక వేళ నిందితుడు అక్కడి నుంచి సులువుగా తప్పించుకుని వెళ్లి ఉంటే మృతదేహం ఆనవాళ్లు తెలియక ఈ కేసు మిస్టరీగా మారి ఉండేదేమో.

ఇదిలా ఉండగా ఈ ఘటనలో రూపేశ్‌కుమార్ అద్దెకారు వినియోగించినట్లు పోలీసుల విచారణలో తేలింది. నగరంలోని గచ్చిబౌలిలో నివాసముండే రూపేశ్‌కుమార్ తన కుటుంబంతో కలిసి తిరిగేందుకు జూబ్లిహిల్స్‌లోని ‘బ్లూ డ్రైవ్’ నుంచి జూన్ 30న కారును అద్దెకు తీసుకున్నాడు. మూడు రోజులపాటు కుటుంబంతో కలిసి సరదాగా అందులోనే తిరిగాడు. చివరకు తన భార్యను అంతమొందించి ఆమె మృతదేహాన్ని అద్దె కారులోనే మదన్‌పల్లి తీసుకొచ్చి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు.

 అనువైన స్థలం కోసం అన్వేషించి..
రూపేశ్‌కుమార్ తన భార్య మృతదేహాన్ని సోమవారం సాయంత్రం 5 గంటలకు కారులో తీసుకుని గచ్చిబౌలి నుంచి బయలుదేరాడు. ఔటర్ మార్గంలో శంషాబాద్ మీదుగా మదన్‌పల్లి వైపు వచ్చాడు. మృతదేహాన్ని కాల్చి వేయడానికి అనువైన స్థలం కోసం కాసేపు కారులోనే రహదారి పరిసర ప్రాంతాలను గమనిస్తూ ముందుకు వెళ్లాడు. మదన్‌పల్లి సమీపంలోకి రాగానే చీకటి పడుతుండడం.. అక్కడ దూరంగా నిర్జన ప్రదేశం కనిపించడంతో కారును అటు వైపుగా మళ్లించాడు. తాను అనుకున్న ప్లాన్ పూర్తి చేసి తిరిగి వెళ్తూ అనూహ్య పరిస్థితుల్లో పోలీసులకు చిక్కాడు. రూపేశ్‌కుమార్ మెహనాని తన భార్య సింథియా వెచెల్(30) దారుణంగా చంపేసి మృతదేహాన్ని ముక్కలుగా చేసి బ్యాగులో తీసుకొచ్చి కాల్చివేసిన విషయం తెలిసిందే.

 కూతురుకు ధైర్యం చెబుతూ..
భార్యను హతమార్చి ఆమె మృతదేహాన్ని పె ట్రోలు పోసి కాల్చి వేసిన తర్వాత కూడా అస లు విషయం కూతురు సానియాకు తెలియకుం డా రూపేశ్‌కుమార్ జాగ్రత్తపడ్డాడు. పోలీసుల కు చిక్కిన సమయంలోనూ విషయం కూతురు కు చెప్పవద్దంటూ వేడుకున్నాడు. గ్రామస్తులు పట్టుకుని చితకబాదిన సమయంలో కారులోనే కూర్చుని ఉన్న సానియాకు అతను ధైర్యం చెబుతూ విషయం తెలియకుండా చూశాడు.

మరిన్ని వార్తలు