మరో మాతృ మరణం

20 Sep, 2016 00:10 IST|Sakshi
మరో మాతృ మరణం

హిందూపురం టౌన్‌ : జిల్లాలో మరో మాతృ మరణం సంభవించింది. గుమ్మఘట్ట మండలం గొల్లపల్లిలో ఆదివారం సరస్వతి అనే బాలింత బ్లీడింగ్‌ అయ్యి మరణించగా.. అలాంటి రక్తహీనత సమస్యతతోనే సోమవారం హిందూపురం ఆస్పత్రిలో అంజినమ్మ (30) అనే మహిళ ప్రసమైన మూడు గంటలకు మృత్యువాత పడింది. వివరాలిలా ఉన్నాయి. పరిగి మండలం పెద్దిరెడ్డిపల్లికి చెందిన అంజినమ్మ 4వ కాన్పు నిమిత్తం హిందూపురం ప్రభుత్వాస్పత్రికి ఆదివారం వచ్చింది. సోమవారం ఉదయం పురిటి నొప్పులు రావడంతో డాక్టర్‌ మాధవి వైద్యపరీక్షలు చేసి సిజరిన్‌ చేయాలని కుటుంబ సభ్యులకు సూచించారు. సాయంత్రం సిజరిన్‌ చేసిన తర్వాత షాక్‌కు గురై చనిపోయింది.
 

కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నించాం :    డాక్టర్‌ మాధవి
అంజినమ్మ వాంతులు, విరేచనాలు అవడంతో ఆదివారం ఆస్పత్రికి వచ్చింది. సోమవారం ఉదయం ఆమెకు పురిటి నొప్పులు వచ్చాయి. అన్ని పరీక్షలు చేస్తే రక్తహీనతతో బాధపడున్నట్లు తెలిసింది. ఇప్పటికే రెండు సాధారణ కాన్పులతో పాటు ఒక సిజరిన్‌ ఆపరేషన్‌ జరిగింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి సిజరిన్‌ ఆపరేషన్‌ చేస్తే షాక్‌కు గురయ్యే అవకాశాలు ఉన్నాయని బంధువులకు వివరించాం. వెంటనే అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాలని సూచించినప్పటికీ రాజకీయ ఒత్తిళ్లు తీసుకురావడంతో శస్త్ర చికిత్స చేశాం. శస్త్ర చికిత్స పూర్తి అయ్యి బిడ్డను సాయంత్రం 4.45కు బయటకు తీసి కుట్లు వేసే సమయంలో ఒక్కసారిగా ఆమె షాక్‌కు గురైంది. వైద్య బృందం అంతా కలిసి ఆమెను బతికించడానికి తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. రాత్రి 7.20 నిమిషాలకు అంజినమ్మ మృతి చెందింది. ఈమెకు పుట్టిన ఆడబిడ్డ క్షేమంగా ఉంది.          

మరిన్ని వార్తలు