వీడని మిస్టరీ!

19 Sep, 2017 04:42 IST|Sakshi
వీడని మిస్టరీ!

∙  5 రోజులు దాటినా దొరకని ఉమామహేశ్వర్‌ రెడ్డి ఆచూకీ
∙ ఆయన కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల్లో ఆందోళన


కడప రూరల్‌: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ (డీఎంహెచ్‌ఓ)లో జిల్లా స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌ (ఎస్‌ఓ)గా పనిచేసిన ఈగ ఉమామహేశ్వరరెడ్డి ఆచూకీ లభించలేదు. ఆగస్టు 30న కర్నూలుకు బదిలీ అయిన ఆయన ఈ నెల 14వ తేదీ సాయంత్రం నుంచి కనిపించడం లేదు. 5 రోజులు దాటినప్పటికీ ఆయన ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు.  

కర్నూలుకు బదిలీ ఆయ్యాక...
కడప నగరం ఎన్జీఓ కాలనీకి చెందిన ఉమామహేశ్వర్‌రెడ్డి (48) ఇక్కడి డీఎంహెచ్‌ఓలో ఎస్‌ఓగా దీర్ఘకాలికంగా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య అనసూయ. ఒక కుమారుడు శివసాయిరెడ్డి ఉన్నారు. ఈ ఏడాది జూన్‌ నెలలో జరిగిన సాధారణ బదిలీల్లో భాగంగా ఆయన కర్నూలులోని హెల్త్‌ ట్రైనింగ్‌ సెంటర్‌కు బదిలీ అయ్యారు. అయితే ఆయన సేవలు ఇక్కడ కీలకమైనందున డీఎంహెచ్‌ఓ రామిరెడ్డి ప్రభుత్వ అనుమతితో ఆయనను ఇక్కడే డిప్యుటేషన్‌పై విధులు చేపట్టేలా చర్యలు తీసుకున్నారు. అనంతరం ఆయన డిప్యుటేషన్‌ను ప్రభుత్వం రద్దు చేయడంతో గడచిన ఆగస్టు  30వ తేదీన కర్నూలు జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు ఎస్‌ఓ బదిలీ అయ్యారు.

14న సాయంత్రం 7.30కి చివరి ఫోన్‌ కాల్‌...
ఉమామహేశ్వర్‌ రెడ్డి కర్నూలోని తన ఆఫీసు (మెడికల్‌ కాలేజీకి)కు ఎదురుగా ఉన్న శ్రీనివాస లాడ్జీలో బసచేస్తున్నారు. ఈ నెల 14న సాయంత్రం 4.45 గంటలకు లాడ్జి నుంచి కిందకు వచ్చారు. ఈ సన్నివేశాలను అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్‌  అయింది. 6.30 గంటలకు తన ఆఫీసు నుంచి బయటకు వచ్చిన ఆయన  లాడ్డీకి రాలేదు. అనంతరం 7.30 గంటలకు ఆఫీస్‌లోని రవి అనే ఉద్యోగికి ఫోన్‌ చేశాడు. అదే చివరి ఫోన్‌ కాల్‌. ఆ ఫోన్‌ కాల్‌ రాజ్‌విహర్‌ సర్కిల్‌ నుంచి వెళ్లినట్లుగా గుర్తించారు. అప్పటి నుంచి అతని దగ్గర ఉన్న నాలుగు ఫోన్‌ నంబర్లు స్విచ్‌ ఆఫ్‌లోనే ఉన్నాయి. ఆ రోజు ఫోన్‌ కాల్స్‌ను పరిశీలిస్తే ఉదయం 6.30 గంటలకు కడపలోని తన భార్య అనసూయతో మాట్లాడారు. అనంతరం 9 సార్లు ఆఫీసుకు ఫోన్‌ చేసినట్లుగా గుర్తించారు.

15న తెలిసిన విషయం...
15వ తేదీన ఉదయం 10 గంటల ప్రాంతంలో కర్నూలులోని ఆఫీసు ఉద్యోగి వసంతరెడ్డి కడపలోని ఆఫీసులో ఉమామహేశ్వరరెడ్డి వద్ద పనిచేస్తున్న బాషాకు ఫోన్‌ చేశారు. ఉమామహేశ్వరరెడ్డి డ్యూటీకి రాలేదని చెప్పారు. బాషా ఆ విషయాన్ని ఆయన భార్య అనసూయకు ఫోన్‌ చేసి తెలిపాడు. అప్పుడు  ఆమె తన భర్త సెల్‌కు ఫోన్‌ చేయగా స్విచ్‌ ఆఫ్‌ చేసి ఉంది. దీంతో అందరిలో ఆందోళన మొదలైంది. దీంతో కడప నుంచి ఆయన బంధువులు కర్నూలుకు వెళ్లి అక్కడ 3వ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అక్కడి అధికారులు కూడా ఫిర్యాదు చేశారు.

మా ఆయనకు ఎవరితోనూ గొడవలు లేవు...
మా ఆయనకు కర్నూలుకు బదిలీ అయ్యాక చాలా డల్‌గా కనిపించాడు. అంతేగాక ఆయనకు అప్పుడు కామెర్లు కూడా ఉన్నాయి. బీపీ ఉంది. అక్కడ భోజనం బాగాలేదని, వాతావరణం సరిగా లేదని చెప్పేవాడు. తనను కూడా అక్కడికి తీసుకుపోవడానికి సరైన ఇల్లు కోసం చూస్తున్నట్లుగా చెప్పాడు. ఇంతలోనే ఇలా అయింది. ఆయనకు ఎవరితోనూ గొడవలు, ఎలాంటి సమస్యలు లేవు. అలాగే మాకు ఎలాంటి ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా లేవు. అధికారులు చర్యలు చేపట్టి  నా భర్త ఆచూకీని తెలపాలి.
– అనసూయ, ఉమామహేశ్వర్‌రెడ్డి భార్య, ఎన్జీఓ కాలనీ కడప.   

మరిన్ని వార్తలు