- అదుపు తప్పిన కారు
- సీట్ బెల్టు పెట్టుకోవడంతో ప్రాణాలు సురక్షితం
వెల్దుర్తి రూరల్ : సంక్రాంతి పండుగకు ఊరెళ్తున్న ఓ కుటుంబం రోడ్డు ప్రమాదానికి గురైంది. అనంతపురానికి చెందిన క్రాంతి కుమార్ హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నాడు. పండుగకు భార్య త్రివేణి, కుమారులు శ్రావణ్, చరణ్తో కలిసి సొంతూరుకు కారులో బయలుదేరాడు. వెల్దుర్తి - మదార్పురం మధ్యలో గ్రానైట్ ఫ్యాక్టరీ వద్ద కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఆ సమయంలో క్రాంతికుమార్ డ్రైవింగ్ చేస్తూ, కుమారులు సైతం సీట్బెల్ట్ పెట్టుకుని ఉండడంతో కుమారులు స్వల్పగాయాలతో బయటపడగా, సీట్ బెల్ట్ ధరించని భార్య త్రివేణి కారు అద్దంలోంచి బయటపడి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108లో కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
రాంగ్రూట్లో వెళ్తుండగా..
డోన్కు చెందిన శ్రీనివాసులు బైక్పై గూడూరుకు వెళ్లి తిరిగి వస్తుండగా తీవ్రంగా గాయపడ్డాడు. పట్టణ సమీపంలోని లద్దగిరి రోడ్డు వద్ద హైవే ఎక్కాడు. రోడ్డు మారడానికి రాంగ్రూట్లో వస్తుండగా ఎదురుగా వస్తూ కర్నూలు వైపు వెళ్తున్న మరో బైక్ను గమనించకుండా ప్రయాణించడంతో ఆబైక్ హ్యాండిల్ తగిలి కిందపడ్డాడు. అదే సమయంలో గుర్తుతెలియని లారీ శ్రీనివాసులు కాళ్లపై వెళ్లడంతో తీవ్రగాయాలపాలయ్యాడు. వెల్దుర్తి ఏఎస్ఐ అక్బర్వలి, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని కర్నూలుకు తరలించారు.