యువతి ప్రవర్తనపై దుష్ప్రచారం చేయడంతో..

11 Aug, 2016 18:28 IST|Sakshi
యువతి ప్రవర్తనపై దుష్ప్రచారం చేయడంతో..
వేములవాడ రూరల్‌: ముగ్గురు యువకుల వేధింపులు భరించలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మండలంలోని తిప్పాపురంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పండుగ లక్ష్మణ్‌ స్థానిక ఓ ప్రయివేటు పాఠశాలలో అటెండర్‌గా పనిచేస్తున్నాడు. ఈయనకు కూతురు కృష్ణవేణి(27), కుమారుడు ఉన్నారు. పేద కుటుంబం కావడంతో కృష్ణవేణి సాక్షరభారత్‌ గ్రామ కోఆర్డినేటర్‌గా పనిచేస్తూ తండ్రికి ఆసరాగా ఉంటోంది. గ్రామానికి చెందిన అక్కెనపల్లి నరేశ్‌ నాలుగేళ్లుగా కృష్ణవేణిని ప్రేమపేరుతో వేధిస్తున్నాడు.

గ్రామానికే చెందిన ఆంజనేయులుగౌడ్, అనిల్‌ యువతి ప్రవర్తనపై దుష్ప్రచారం చేస్తున్నారు. ఇటీవల వేధింపులు ఎక్కువ కావడంతో మనస్తాపం చెందింది. ఐదు రోజుల క్రితం ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. తీవ్రంగా గాయపడిన కృష్ణవేణి చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందింది. అక్కెనపల్లి నరేశ్, ఆంజనేయులుగౌడ్, అనిల్‌ వేధింపులు భరించలేకనే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని తండ్రి లక్ష్మణ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై సురేశ్‌ తెలిపారు.
మరిన్ని వార్తలు