హత్యా ? ఆత్మహత్యా ?

17 Sep, 2016 20:25 IST|Sakshi
హత్యా ? ఆత్మహత్యా ?
* అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
* ఆత్మహత్య చేసుకున్నాడనేది స్నేహితుడి మాట
హత్య చేసి ఉండొచ్చని మృతుడి బంధువుల ఆరోపణ
 
పిడుగురాళ్ళ టౌన్‌: పట్టణ శివారు నలబోతుల కుంటలో ఓ యువకుడు శనివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్నేహితులు ఆత్మహత్య చేసుకున్నాడని చెబుతుండగా, బంధువులు మాత్రం హత్యచేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని పాటిగుంతల కాలనీకి చెందిన షేక్‌ అక్రమ్‌ (23) ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. అతడు పట్టణానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. ఆమెకు ఈ నెల 27న మరో యువకుడితో పెళ్లి జరుగుతుందని తెలిసి తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. 
 
ఏమైందో ఏమో..?
ఈ నేపథ్యంలోనే శుక్రవారం సాయంత్రం అక్రమ్‌ తన స్నేహితులు సాగర్, శ్రీనుబాషాలతో కలిసి డ్రైవర్స్‌కాలనీ సమీపంలో ఉన్న నలబోతుల కుంట వద్దకు మద్యం తాగేందుకు వెళ్లాడు. మద్యం చాలలేదని సాగర్‌ను పట్టణానికి పంపించాడు. ఏమైందో ఏమో అక్రమ్‌ తాను చనిపోతున్నట్టు ఫోన్‌లో మాట్లాడుతూ కుంటలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు పక్కనే ఉన్న శ్రీనుబాషా స్థానికులకు చెప్పాడు. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ఆత్మహత్య చేసుకోగా, ఆ విషయాన్ని రాత్రి 10 గంటలకు కుంట సమీపంలోని ప్లాట్‌ ఇన్‌చార్జి తిమ్మారెడ్డికి చెప్పి వెళ్లారు. శనివారం ఉదయం ప్లాట్‌ ఇన్‌చార్జి బంధువులకు సమాచారం అందించాడు. బంధువులు కుంట వద్దకు చేరుకుని గజ ఈతగాళ్ల సహకారంతో అక్రమ్‌ మృతదేహాన్ని వెలికితీశారు.  ఏఎస్‌ఐ బాషా కేసు నమోదుచేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి స్నేహితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
మరిన్ని వార్తలు