హైదరాబాద్ : సినీనటుడు పవన్ కల్యాణ్ తో తెలంగాణ బీజేపీ నేత కిషన్ రెడ్డి సోమవారం భేటీ అయ్యారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో బీజేపీ తరపున ప్రచారం చేసేందుకు రావాల్సిందిగా కిషన్ రెడ్డి ఈ సందర్భంగా పవన్ను కోరారు. అయితే దీనిపై రెండు రోజుల్లో నిర్ణయం వెల్లడిస్తానని పవన్ చెప్పినట్లు సమాచారం.
భేటీ అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ... నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావాలన్నదే పవన్ ఆశయమన్నారు. దేశానికి మేలు జరగాలంటే కాంగ్రెస్ను ఓడించి బీజేపీని అధికారంలోకి తీసుకు రావలన్నదే పవన్ ఆకాంక్ష అన్నారు. కాగా టికెట్ల కేటాయింపులో పవన్ ప్రమేయం ఏమాత్రం లేదన్నారు. బీజేపీ తరపున పవన్ ప్రచారం చేస్తారని, అయితే పొత్తుల నేపథ్యంలో టీడీపీకి కూడా పవన్ ప్రచారం ఉపకరిస్తుందన్నారు.