ముఖ కాంతికి...

12 Feb, 2019 01:37 IST|Sakshi

మొటిమలు, మచ్చలు లేకుండా ముఖ చర్మానికి నిగారింపు రావాలంటే..

►కొద్దిగా తులసి ఆకులు, మూడు బచ్చలి ఆకులను కలిపి గ్రైండ్‌ చేయాలి. దీంట్లో సరిపడా నీటిని జత చేసి పేస్ట్‌ చేసి ముఖానికి పట్టించి 20 నిమిషాల తరవాత కడిగేయాలి. ఈ విధంగా వారంలో ఒకసారి క్రమం తప్పకుండా చేస్తే చర్మం మీ కాంతిమంతం అవుతుంది.

►అర టీ స్పూన్‌ ఆవాల నూనెలో కొన్ని చుక్కల నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమన్ని వేళ్లతో కొద్దికొద్దిగా తీసుకుని వలయాకారంలో 10 నిమిషాల పాటు మసాజ్‌ చేసి, గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఈ విధంగా వారంలో ఒకసారి చేస్తే చర్మం నిగారిస్తుంది.

►తెల్ల ఉల్లిపాయని గ్రైండ్‌ చేసి రసం తీయాలి. దీంట్లో పావు టీ స్పూన్‌ తేనె, చిటికెడు రాళ్ల ఉప్పు వేయాలి. అది కరిగిన తరవాత ఈ మిశ్రమాన్ని మొటిమల మీద అప్లై చేసి 20 నిమిషాల వరకు ఉంచి చన్నీటితో కడిగేయాలి. మొటిమలు తగ్గుతాయి.

►దాల్చిన చెక్కను పొడి చేయాలి. దీంట్లో కొద్దిగా నీటిని చేర్చి పేస్ట్‌లా కలపాలి. మొటిమలు, మచ్చలు ఉన్న చోట ఈ మిశ్రమాన్ని అప్లై చేసి ఆరిన తరవాత కడిగేయాలి. వారానికి ఒక్కసారి ఈ విధంగా క్రమం తప్పకుండా చేస్తే మొటిమలు, మచ్చలు తగ్గి చర్మకాంతి పెరుగుతుంది.

►టేబుల్‌ స్పూన్‌ శనగపిండిలో గుడ్డులోని తెల్లసొన, టీ స్పూన్‌ గంధం పొడి కలపాలి. ఈ పేస్ట్‌ని ముఖానికి, మెడకు పట్టించి 20 నిమిషాల తరవాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఈ ప్యాక్‌లు అన్ని రకాల చర్మాల వారికి అనువుగా ఉంటాయి. వారంలో ఒక్కసారి ఈ ప్యాక్‌లను వాడడం వలన చర్మకాంతిలో వచ్చే మార్పు ఇట్టే తెలిసిపోతుంది.

►సగం క్యారట్, ఒక ముక్క నారింజ, అర టేబుల్‌ స్పూన్‌ పాలు కలిపి పేస్ట్‌ చేయాలి. ఈ మిశ్రమాన్ని  ముఖానికి పట్టించి 20 నిమిషాల తరవాత కడిగేయాలి. ఈ ప్యాక్‌ వారంలో ఒకసారి చేయడం వల్ల చర్మకాంతి మెరుగుపడుతుంది. 

>
మరిన్ని వార్తలు