బొలీవియా

8 Nov, 2014 22:40 IST|Sakshi
బొలీవియా

ప్రపంచవీక్షణం
 
నైసర్గిక స్వరూపం
ఖండం - దక్షిణ అమెరికా
వైశాల్యం -  10,98,581 చ.కి.మీ.
జనాభా -  1,05,56,102 (తాజా జనాభా లెక్కల ప్రకారం), రాజధాని- లా పాజ్, కరెన్సీ - పెసో, ప్రభుత్వం - యునిటరీ ప్రెసిడెన్షియల్ కాన్‌స్టిట్యూష నల్ రిపబ్లిక్, భాషలు- స్పానిష్, క్వెచువా, అయిమారా,
మతం - క్రైస్తవులు  
వాతావరణం - జనవరి-జులై మధ్య 1 నుండి 17 డిగ్రీలు, ఆగష్టు -డిసెంబర్ మధ్య 6 నుండి 19 డిగ్రీలు ఉంటుంది.
పంటలు - బంగాళదుంప, మొక్కజొన్న, చెరకు, వరి, కసావా, కాఫీ, లామాస్.
ఖనిజాలు - తగరం, రాగి, సీసం, జింకు, సల్ఫర్, ఇనుము, సహజవాయువులు, టంగ్‌స్టన్, వెండి, బంగారం, బిస్మత్, ఆంటిమొనీ
మొదలైనవి. పరిశ్రమలు - గనులు, సహజవాయువులు, చమురుశుద్ధి, దుస్తులు, హండీక్రాప్ట్, ఫుడ్ ప్రాసెసింగ్, సిమెంట్ పరిశ్రమ, ఎగుమతులు - తగరం, ఆంటిమోనీ, టంగ్‌స్టన్, జింకు, వెండి, సీసం, సహజవాయువులు. స్వాతంత్య్రం వచ్చింది - 1825 ఆగష్టు 6న, సరిహద్దులు - పరాగ్వే, చిలీ, అర్జెంటీనా, పెరూ, బ్రెజిల్
 
పరిపాలన

దేశాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం 9 డిపార్ట్‌మెంట్‌లుగా విభజించారు. వీటిని తిరిగి ప్రావిన్స్‌లుగా, మున్సిపాలిటీలుగా, కాంటన్‌లుగా విభజించారు. అన్ని ప్రాంతాల్లో స్వతంత్రపాలన ఉంటుంది. అన్నింటినీ దేశాధ్యక్షుడు పర్యవేక్షిస్తాడు. మనదేశంలో రాష్ట్రాలు,  జిల్లాలు, మున్సిపాలిటీలుగా విభజించినట్లన్నమాట.
 
ప్రజలు-సంస్కృతి: ఇక్కడ లాటిన్ అమెరికా సంస్కృతి దర్శనమిస్తుంది. దేశప్రజలు తమ గతకాలపు సంస్కృతిని కాపాడుకోవడానికి వివిధ దేశవాళీ పండుగలను నిర్వహించుకుంటారు. వీటిలో ముఖ్యమైనది-‘కాపోరేల్స్’ దీనిని దేశమంతటా జరుపుకుంటారు. దేశంలో వివిధ ప్రాంతాల ప్రజలు వివిధ రీతులలో వస్త్రధారణ చేస్తారు. మొత్తంగా చూస్తే దేశంలో 30 రకాల వస్త్రరీతులు కనబడతాయి. మహిళలు భుజాల నుండి మోకాళ్ల కింది వరకు వచ్చే స్కర్టు ధరిస్తారు.
 
ఆహారం: ఇక్కడి ప్రజలు తినే మధ్యాహ్న భోజనాన్ని అల్‌మూర్జో అంటారు. ఈ భోజనంలో సూప్, మాంసం, అన్నం, బంగాళదుంపలు ఉంటాయి. ఉదయంపూట మనం తినే కజ్జికాయలు లాంటివి తయారుచేస్తారు. వీటిని వెన్న, ఉల్లిపాయలు, ఆలివ్‌లు, లోకోటోలతో కలిపి తయారుచేస్తారు. పందిమాంసం, సూప్, బీన్స్‌వేపుడు వంటివాటిని భోజనంలో తీసుకుంటారు. బొలీవియా టీ(చాయ్)ని ఆపి అంటారు. ఇది నిమ్మరసం, మొక్కజొన్నపిండి, యాలకులు, లవంగాలు, కోకో ఆకులు మిశ్రమం చేసి పొడిని తయారుచేసి ఆ పొడిని వేడినీటిలో వేసి కాచి వడబోసి తాగుతారు. వరి అన్నం, వెన్న కలిపి తయారు చేసే వంటకాన్ని ఆర్రోజ్ కాన్ క్వెసో అంటారు. బొలీవియాలో వరి అన్నం పుష్కలంగా దొరుకుతుంది. ఎందుకంటే అక్కడ వరిధాన్యం బాగా పండుతుంది.
 
1. లాపాజ్: బొలీవియా దేశానికి పరిపాలన రాజధాని నగరం. ఈ నగరం మొత్తం కొండలపైనే ఉంటుంది. ప్రపంచంలో అతి ఎత్తై రాజధాని నగరం లాపాజ్. ఇది భూమి నుండి దాదాపు 3650 మీటర్ల ఎత్తులో ఉంది. అత్యంత ఎక్కువ జనాభా కలిగిన నగరం కూడా ఇదే. ఈ నగరం 15వ శతాబ్దం నుండి ఉనికిలో ఉంది. చుట్టూ ఆండీస్ పర్వత శ్రేణులు నగరాన్ని ఎంతో అందాన్ని  ఇస్తుంటాయి. నగరంలో సగర్‌నాగ వీధి ఎప్పుడూ యాత్రీకులతో కిటకిటలాడుతూ ఉంటుంది. నగరంలో దయ్యాల మార్కెట్ కూడా ఉంది. ఈ మార్కెట్‌లో ఎండబెట్టిన కప్పలు, కొన్ని సముద్ర జంతువులను అమ్ముతారు. బ్లాక్ మార్కెట్ అని పిలుచుకునే మెర్కాడో నెగ్రో అనే ప్రాంతంలో ఎక్కువగా దుస్తులు, సంగీత పరికరాలు అమ్ముతారు. నగరంలో ఇంకా కల్లెజాన్, ప్లాజా మురిల్లో, వల్లెడిలా లూనా ప్రాంతాలతో బాటు సాన్‌ఫ్రాన్సిస్కో మ్యూజియం, టివనాకు మ్యూజియం, కోకా మ్యూజియం, మ్యూజియం ఆఫ్ మెటల్స్‌లను చూడాల్సిందే!
 
2. వెండి గనులు: బొలీవియాలో వెండిగనులు పోటోసిలో ఉన్నాయి. ఇక్కడ క్రీస్తుశకం 1545 నుండి కొండలను తవ్వి వెండిని తీస్తున్నారు. ఈ నగరాన్ని సెర్రోరికో అంటారు. ఒకప్పుడు ఈ నగరం మొత్తం ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన నగరంగా పేరుగాంచింది. ఈ గనులలోకి పర్యాటకులు వెళ్ళి అక్కడి గనుల తవ్వకాన్ని, ముడి ఖనిజాలను స్వయంగా చూడవచ్చు. ఈ గనులు భూమికి 240 మీటర్ల లోతులో ఉంటాయి. గనిలోపలి భాగాన్ని పైలావిరి అంటారు. ఇందులోకి పర్యాటకులు నేరుగా వెళ్ళే అవకాశం ఉంది. గని ముందుభాగంలో గనులరాజు బొమ్మ విచిత్రంగా కనబడుతుంది. ఇక్కడ వెండిని గత 455 సంవత్సరాలుగా నిరంతరం వెలికితీస్తూనే ఉన్నారు. ఈ గనులలో దాదాపు 10 వేలమంది కార్మికులు పనిచేస్తూ ఉంటారు.
 
3. ఉయుని ఉప్పు మైదానం: ఇది పోటోసి నగరానికి సమీపంలో ఉంది. దేశానికి దక్షిణ భాగంలో ఉంది. ఇది 11 వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ప్రపంచంలోనే అత్యంత విశాలమైన ఉప్పు మైదానంగా ప్రసిద్ధి చెందింది. దీనిని ఉప్పు ఎడారిగా పిలవవచ్చు. ఈ ఉప్పు మైదానం సముద్రమట్టానికి 3600 మీటర్ల ఎత్తులో ఉంది. ఇంత ఎత్తులో ఇలా ఉప్పు ఎడారి ఎలా ఏర్పడిందో తెలుసుకుంటే ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. ఒకప్పుడు ఈ ప్రాంతం ఒక సముద్ర ద్వీపం. దాదాపు 13వేల సంవత్సరాల క్రితం ఇందులోని నీరంతా ఆవిరైపోయి ఉప్పు మాత్రమే మిగిలింది. మధ్యభాగంలో ఉప్పు 10 మీటర్ల మందంలో ఉంటుంది. ఈ ఉప్పు ఎడారి మీద నిలబడితే మేఘాలు మనల్ని తగులుతూ కదులుతుంటాయి. పర్యాటకులకు ఇదో విచిత్రమైన అనుభవం. ఎప్పుడు తెల్లగా మెరుస్తూ ఉంటుంది. ఎడారిమీద గాలివీయడం వల్ల మైదానంలో పాలిహైడ్రల్ గుర్తులు ఏర్పడతాయి. వాటిని చూస్తుంటే ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. ఇక్కడ ఫ్లెమింగోలు, ఆండియన్‌జాతి నక్కలు అధికంగా అగుపిస్తాయి. రాజధాని లాపాజ్ నుండి దాదాపు 12 గంటల ప్రయాణం చేసి ఇక్కడికి చేరుకోవచ్చు.
 
4. జెసూట్ మిషన్స్: ఇది ఒకప్పుడు అడవి. ఇక్కడికి క్రైస్తవ మిషనరీలు వచ్చి ఆటవికులనందరినీ క్రైస్తవులుగా మార్చారు. ఆ తర్వాత స్పెయిన్ దేశం బొలీవియాను తమ అధీనంలోకి తీసుకున్నాక ఈ ప్రాంతంలో చర్చిల నిర్మాణం జరిగింది. ఈ ప్రాంతాన్ని చికిటో అంటారు. ఈ ప్రాంతం 16వ శతాబ్దంలో కనుగొనబడి నేటికీ ఆనాటి వాతావరణంలోనే ఉండడం ఒక గొప్ప విశేషం. ఇక్కడి నిర్మాణాలు నేటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఇది పర్యాటకులను విపరీతంగా ఆకర్షించే విషయం. చర్చిల లోపల ఎంతో అందమైన నిర్మాణశైలి కనబడుతుంది. బంగారంతో చేసిన అలంకరణలు నేటికీ అలాగే ఉన్నాయి. ఈ ప్రదేశం సాంటాక్రజ్‌కు సమీపంలో ఉంది. మొదట జెసూట్‌లు ఇక్కడికి వచ్చి భూమి మీద దేవుడి నగరాన్ని నిర్మించాలని పూనుకున్నారు. ఆ ప్రాంతానికి ఇప్పుడు వెళితే 17వ శతాబ్దపు కాలంలోకి వెళ్లినట్లుగా అనుభూతి కలుగుతుంది. 1991లో ఈ మొత్తం ప్రాంతాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ఎంపిక చేసింది.
     
 చరిత్ర: దక్షిణ అమెరికా ఖండంలో బొలీవియా ఒక నిత్యదరిద్రంలో కొట్టుమిట్టాడుతున్న దేశం. ఇక్కడ ద్రవ్యోల్బణం చాలా ఎక్కువ. ప్రభుత్వ అస్థిరత చాలా తీవ్రంగా ఉంది.16వ శతాబ్దంలో ఈ దేశం స్పెయిన్ దేశపు రాజుల అధీనంలో ఉన్నప్పుడు ఇక్కడ పనులు చేయడానికి భారతదేశం నుండి ప్రజలను తీసుకువచ్చి బానిసలుగా మార్చి, వ్యవసాయ పనులు చేయించారు. అలా భారతీయులు శతాబ్దాలుగా అక్కడ బానిసలుగా బ్రతికి, ఆ దేశానికి స్వాతంత్య్రం వచ్చాక అక్కడ ప్రజలుగా మారిపోయారు. ఇతర దేశాలు వీలైనంతగా ఈ దేశ భూభాగాన్ని లాక్కున్నాయి. 1952 తర్వాత మాత్రమే భారతసంతతి వారికి కొంత లాభం చేకూరింది. దేశంలో దాదాపు 50 శాతం భూమి వ్యవసాయానికి గానీ, నివాసానికి గానీ వీలుగా లేదు. జనాభా అంతా కేవలం 50 శాతం భూభాగంలోనే కేంద్రీకృతమైంది.

మరిన్ని వార్తలు