వేడినీటి స్నానంతోనూ వ్యాయామ లాభాలు...

16 Nov, 2018 00:34 IST|Sakshi

రక్తంలో చక్కెర మోతాదులను నియంత్రించుకునేందుకు మధుమేహులు ఎన్నో ప్రయత్నాలు చేస్తూంటారు. ఈ జాబితాలోకి వేడినీటి స్నానం కూడా చేర్చుకుంటే మేలని అంటున్నారు శాస్త్రవేత్తలు. అంతేకాదు.. దీనివల్ల శరీరంలో ఏర్పడే మంట/వాపు తీవ్రత కూడా తగ్గుతుందని అమెరికన్‌ ఫిజియలాజికల్‌ సొసైటీ శాస్త్రవేత్తలు అధ్యయన పూర్వకంగా తేల్చారు. సాధారణంగా వ్యాయామం చేసినప్పుడు శరీరంలో మంట/వాపుకు సంబంధించిన కొన్ని రసాయనాలు ఎక్కువవుతాయి. అయితే తాజా పరిశోధనల ప్రకారం శరీర ఉష్ణోగ్రత పెరిగితే ఈ మంట/వాపు తగ్గుతాయి. ఈ నేపథ్యంలో వ్యాయామానికి ప్రత్యామ్నాయాలు ఏమిటో తెలుసుకునేందుకు అమెరికన్‌ ఫిజియాలజీ సొసైటీ ప్రయత్నాలు మొదలుపెట్టింది.

కొంతమంది ఊబకాయులు, వ్యాయామం చేయని వ్యక్తులను ఎన్నుకుని ప్రయోగాలు చేశారు. వీరిని రెండు గుంపులుగా విడగొట్టారు. ఒక వర్గాన్ని వేడిగా ఉండే గదిలో.. ఇంకో వర్గం వారిని వేడినీటిలో కొద్దిసేపు ఉండేలా చేశారు. మూడు రోజుల గ్యాప్‌తో గుంపులు తాము చేసే పనిని మార్చుకున్నాయి కూడా. దశలవారీగా సేకరించిన రక్తనమూనాలను పరిశీలించినప్పుడు మంట/వాపులకు సంబంధించిన ఐఎల్‌–6 రసాయనం తగ్గినట్లు తెలిసింది. అంతేకాకుండా ఫాస్టింగ్‌ బ్లడ్‌ షుగర్‌ మోతాదులు కూడా నియంత్రణలోకి వచ్చినట్లు స్పష్టమైంది.  

>
మరిన్ని వార్తలు