ఒక మహిళగా.. తల్లిగా సంతోషించాను – మంచు లక్ష్మి

7 Dec, 2019 03:08 IST|Sakshi

దిశ ఘటనపై స్పందించడానికి నటి, నిర్మాత మంచు లక్ష్మి ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ – ‘‘దిశ ఘటన తెలిసినప్పటి నుంచి నేను చాలా డిస్టర్బ్‌అయ్యాను. నిందితుల ఎన్‌కౌంటర్‌ వార్త వినగానే ఒక మహిళగా, తల్లిగా సంతోషించాను. కానీ, ఈ ఎన్‌కౌంటర్‌ నిజమైన పరిష్కారమా? ఈ ఘటనలాగా అన్ని సంఘటనలు చూడలేం. ఎందుకంటే.. ఇలాంటిది ఒక చట్టంగా రావాలి. నిర్భయ కేసు నిందితులను ఏడేళ్లుగా మేపుతున్నారు.

ప్రధాన నిందితుడు బయట హాయిగా తిరుగుతున్నాడు? దాన్ని ప్రశ్నించాలి? దిశనే కాదు.. నెలల పాపలు, ముసలివాళ్లు ఏం తప్పు చేశారు? ఎన్‌కౌంటర్‌ అన్నిటికీ సమాధానం కాదు. ఆడవాళ్ల స్వేచ్ఛను అడ్డుకోవడానికి, వారికి గీతలు గీయడానికి ఎవరికీ హక్కు లేదు. 80 శాతం లైంగిక దాడులు బయటకు రావడం లేదు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ పెరగాలి.. చట్టాలు మారాలి. ఆ మార్పులు వస్తాయంటే ఇండస్ట్రీ మొత్తాన్ని బయటకు తెస్తాను. కానీ, చట్టాలను గౌరవించాలి. తల్లిదండ్రులు ఆడపిల్లలను పెంచే తీరులో, విద్యా వ్యవస్థలో సమానత్వం రావాలి’’ అన్నారు.

రేపిస్టులందర్నీ కాల్చి చంపాలి. అదే మనకు కావాల్సింది. పోలీసులకు హ్యాట్సాఫ్‌. ఇవాళ నిజంగా సెలబ్రేట్‌ చేసుకోవాల్సిన రోజు.
– నటి చార్మి

మరిన్ని వార్తలు