పరిణీతి అవుట్‌ నోరా ఇన్‌

8 Jan, 2020 04:12 IST|Sakshi

సినిమా

హిందీ చిత్రం ‘భుజ్‌: ది ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియా’ నుంచి కథానాయిక పరిణీతీ చోప్రా తప్పుకున్నారని బాలీవుడ్‌ సమాచారం. అభిషేక్‌ దుధియా దర్శకత్వంలో అజయ్‌ దేవగన్, సంజయ్‌ దత్, సోనాక్షీ సిన్హా, రానా, ప్రణీత ప్రధాన తారాగణంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘భుజ్‌: ది ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియా’. ఇందులో గూఢచారిగా పరిణీతి చోప్రా నటించాల్సింది. కానీ, ఇప్పుడు ఆమె స్థానంలోకి నోరా ఫతేహీ వచ్చారని టాక్‌. ఈ నెల 12 తర్వాత జరిగే ఈ సినిమా షూట్‌లో జాయిన్‌ అవుతారట నోరా. ఎన్టీఆర్‌ ‘టెంపర్‌’లో ‘ఇట్టాగే రెచ్చిపోదాం’, ‘బాహుబలి’లో ‘మనోహరీ..’ వంటి స్పెషల్‌ సాంగ్స్‌తో ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్నారు నోరా.

ఇంకా కిక్‌ 2, లోఫర్‌ చిత్రాల్లోనూ ప్రత్యేక పాటలకు కాలు కదిపారు. హిందీలోనూ స్పెషల్‌ సాంగ్స్‌ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న నోరా ఇటీవల కొన్ని హిందీ చిత్రాల్లో కీలక పాత్రలకు సై అంటున్నారు. తాజాగా ‘భుజ్‌: ది ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియా’ చిత్రంలో గూఢచారిగా నటించడానికి సిద్ధమయ్యారామె. ఈ చిత్రం ఆగస్టు14న విడుదల కానుంది. ఇక ఈ సినిమా నుంచి పరిణీతీ ఎందుకు తప్పుకున్నారంటే ‘సైనా’ చిత్రంతో బిజీగా ఉండటం వల్లే అని బాలీవుడ్‌ టాక్‌. ‘సైనా’ చిత్రం నుంచి శ్రద్ధా కపూర్‌ తప్పుకున్నాక ఆమె స్థానంలోకి పరిణీతి వచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది.

మరిన్ని వార్తలు