టాప్-10 కెరీర్స్... బెస్ట్ ఆపర్చునిటీస్

2 Mar, 2014 22:49 IST|Sakshi

డిగ్రీ, పీజీ కోర్సులు పూర్తిచేసినవారికి ఉద్యోగాలపరంగా ఎన్నో అవకాశాలున్నాయి. అయితే రానున్న ఐదారేళ్లలో మంచి ఉద్యోగావకాశాలు కల్పించే రంగాలుగా.. ఏవియేషన్, హెల్త్‌కేర్, రిటైల్ మేనేజ్‌మెంట్, సోషల్ వర్క్/రూరల్ డవలప్‌మెంట్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఫార్మా, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్‌మెంట్, హాస్పిటాలిటీ, టెలికం మేనేజ్‌మెంట్, మర్చెంట్ నేవీ నిలుస్తాయని ఆయా రంగాల నిపుణులు పేర్కొంటున్నారు. అందుకు తగిన విధంగా అభ్యర్థులు నైపుణ్యాలు పెంచుకోవాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో టాప్‌టెన్ కెరీర్స్‌పై ప్రత్యేక ఫోకస్..
 
 ఏవియేషన్.. ఎమర్జింగ్
 
 ఏవియేషన్ రంగంలో.. ప్రతి ఏటా 121 మిలియన్ దేశీయ, 41 మిలియన్ల అంతర్జాతీయ ప్రయాణికులతో తొమ్మిదో పెద్ద దేశంగా నిలుస్తున్న భారత్.. 2020 నాటికి మూడో పెద్ద దేశంగా ఎదుగుతుందని అంచనా. దీన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం రాజీవ్ గాంధీ నేషనల్ ఏవియేషన్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తోంది. దీని ద్వారా పైలట్ లెసైన్సింగ్ కోర్సులతోపాటు గ్రౌండ్ డ్యూటీ, క్యాబిన్ క్రూ, ఎయిర్ క్రాఫ్ట్ ఇంజనీరింగ్ కోర్సులను ప్రారంభించాలని నిర్ణయించింది. మన రాష్ట్రంలో ప్రభుత్వ పరిధిలో ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ అకాడమీ.. ఈ రంగానికి చెందిన టెక్నికల్ కోర్సులను అందిస్తోంది. ‘ఏవియేషన్ రంగం కేవలం ప్రయాణికుల విభాగంలోనే కాకుండా కార్గో విభాగంలోనూ శరవేగంగా వృద్ధి చెందుతోంది. కాబట్టి సమీప భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు ఏర్పడతాయి. ఈ మేరకు నిపుణుల అవసరం పెరుగుతోంది. దీన్ని గమనించి విద్యార్థులు ఈ రంగంలో అడుగుపెడితే ఉజ్వల భవిష్యత్తును అందుకోవచ్చు.’ అంటున్నారు ఏపీ ఏవియేషన్ అకాడమీ డెరైక్టర్ కెప్టెన్ ఎస్.ఎన్.రెడ్డి.
 
 హెల్త్ కేర్.. కెరీర్ హెవెన్
 

 ఆల్ ఇండియా మేనేజ్‌మెంట్ అసోసియేషన్, సీఐఐ అంచనాల ప్రకారం హెల్త్‌కేర్ రంగంలో 2020 నాటికి.. పారా మెడికల్ సిబ్బంది నుంచి సీఈవో స్థాయి వరకు 40 మిలియన్ల ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి. దీనికి ప్రధాన కారణం.. ఇతర దేశాలతో పోలిస్తే ఇక్కడ చికిత్స ఖర్చులు తక్కువగా ఉండ టం, మెడికల్ టూరిజంకు ప్రాధాన్యం పెరగడమే. కేవలం క్లినికల్ సర్వీసులే కాకుండా హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్‌కు సంబంధించి హాస్పిటల్ మేనేజ్‌మెంట్ ప్రొఫెషనల్స్ కొరత కూడా అధికంగానే ఉంది. ఔత్సాహికులు వీటిని దృష్టిలో పెట్టుకుంటే పదో తరగతి మొదలు.. పీజీ వరకు తమ అర్హతకు తగిన ఉద్యోగ వేదికగా హెల్త్‌కేర్ విభాగం నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రారంభంలో కనీసం నెలకు రూ. పదిహేను వేల జీతంతో కెరీర్ ప్రారంభించొచ్చు. నర్సింగ్ కోర్సులు పూర్తి చేసిన వారికి అమెరికా, యూరప్ దేశాల్లోనూ విపరీతమైన డిమాండ్ నెలకొంది.
 
 రిటైల్.. ఫర్ ఫ్యూచర్ వెల్
 
 సింగిల్ బ్రాండ్ రిటైల్‌లో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు, మల్టీ బ్రాండ్ విభాగంలో 51 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే రిటైల్ రంగంలో ఐదో పెద్ద దేశంగా నిలిచిన భారత్.. 2020 నాటికి ఈ రంగంలో 1.3 ట్రిలియన్ డాలర్ల వృద్ధి నమోదు చేయనుంది. అంటే ఆ స్థాయిలో రిటైల్ ఔట్‌లెట్లు ఏర్పాటు కానున్నాయి. అందుకు తగిన విధంగా స్టోర్ కీపర్ నుంచి స్టోర్ సీఈవో వరకు వేలల్లో అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. దీన్ని గుర్తించిన పలు ఇన్‌స్టిట్యూట్‌లు ఇప్పటికే రిటైల్ మేనేజ్‌మెంట్‌లో పలు డిప్లొమా, సర్టిఫికెట్, పీజీ డిప్లొమా, పీజీ కోర్సులను అందిస్తున్నాయి. ‘రిటైల్ మేనేజ్‌మెంట్‌లో ఇప్పుడు పలు కోర్సులు, ఇన్‌స్టిట్యూట్‌లు అందుబాటులోకి వస్తున్నప్పటికీ.. వాటికి గల గుర్తింపు, ఇతర ప్రామాణికాల ఆధారంగానే వాటిని ఎంచుకోవాలి’ అనేది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్-హైదరాబాద్ రిటైల్ మేనేజ్‌మెంట్ కోర్సు కోఆర్డినేటర్ శ్రీకాంత్ సూచన.
 
 సోషల్ సర్వీస్ / ఎన్‌జీఓ
 
 ప్రభుత్వం గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేయడం, ప్రతి కంపెనీ తమ లాభాల్లో 2 శాతం నిధులను కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పేరిట సామాజిక సేవకు కేటాయించాలనే నిబంధన విధించడంతో సోషల్ వర్క్, రూరల్ డవలప్‌మెంట్ వంటి కోర్సులు చేసినవారికి అవకాశాలు పెరిగాయి. దేశంలో చాలా యూనివర్సిటీలు ఎంఏలో ఈ కోర్సులను అందిస్తున్నాయి. ఈ విభాగాల్లో రెండు లక్షల ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. నేషనల్ రూరల్ లైవ్‌లీహుడ్ మిషన్ పథకం కింద 12వ పంచవర్ష ప్రణాళికలో 15.75 లక్షల స్వయం సహాయక బృందాలను నియమించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ కోర్సుల వైపు అడుగులు వేస్తే మంచి అవకాశాలు అందుకోవచ్చు అంటున్నారు ఎన్‌ఐఆర్‌డీ సీపీజీఎస్ డెరైక్టర్ ఎస్.ఎం.ఇలియాస్.
 
 ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్
 
 స్వయం ఉపాధి దిశగా కెరీర్ కోరుకునే వారికి సరైన వేదిక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. అంటే సొంతంగా ఏదైనా వ్యాపార, ఉత్పత్తి సంస్థను నెలకొల్పి ఆదాయార్జన పొందడం. ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్ వంటి కోర్సులు చేసిన వారికి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కలిసొచ్చే అంశంగా చెప్పొచ్చు. ఈ మేరకు ఐఎస్‌బీ, ఐఐటీ-కాన్పూర్, నర్సీమొంజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ తదితర సంస్థలు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మేనేజ్‌మెంట్‌లో పీజీ కోర్సులను అందిస్తున్నాయి. మంచి ఐడియాలతో వచ్చే వారికి ఆర్థికంగా చేయూత కూడా అందిస్తూ సొంత వ్యాపారాభివృద్ధి దిశగా ఊతమిస్తున్నాయి.
 
 ఫార్మా కెరీర్
 
 సగటున 12 శాతం వార్షిక వృద్ధితో పయనిస్తూ.. అంతే స్థాయిలో అవకాశాలు కల్పిస్తున్న రంగం ఫార్మాస్యూటికల్. నేషనల్ స్కిల్ డవలప్‌మెంట్ కార్పొరేషన్ అంచనాల ప్రకారం 2015 నాటికి లక్ష నుంచి లక్షన్నర మంది నిపుణుల అవసరం ఉంది. ఇంటర్ ఎంపీసీ/బైపీసీ అర్హతతో బీఫార్మసీలో ప్రవేశించొచ్చు. ఆ తర్వాత పీజీ, పీహెచ్‌డీ చేయొచ్చు. దేశీయ ఫార్మా కంపెనీల్లోనూ, విదేశాల్లోనూ, విదేశీ ఔట్ సోర్సింగ్ సంస్థల్లోనూ అవకాశాలుంటాయి. పీజీ స్థాయిలో ఫార్మకాలజీ, ఫార్మాస్యూటిక్స్, టాక్సికాలజీ వంటి డిమాండ్ గల స్పెషలైజేషన్లు పూర్తి చేస్తే అవకాశాలకు ఆకాశమే హద్దు అంటున్నారు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (నైపర్)-హైదరాబాద్ క్యాంపస్ రిజిస్ట్రార్ ఎన్.సత్యనారాయణ.
 
 కెరీర్ ఇన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్‌మెంట్

 
 ఒక దేశ ప్రగతికి మూలం.. మౌలిక సదుపాయాలు. అందుకే.. ప్రభుత్వం ఇటీవలి కాలంలో రోడ్లు, రైల్వేస్, ఏవియేషన్, షిప్పింగ్, ఎనర్జీ, పవర్, ఆయిల్ అండ్ గ్యాస్ ప్రొడక్షన్ తదితర విభాగాల్లో వృద్ధికి ప్రాధాన్యమిస్తోంది. వచ్చే పదేళ్లలో ఈ రంగం 7 నుంచి 10 శాతం సగటు వృద్ధి సాధిస్తుందని అంచనా. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్‌మెంట్‌లోని నిర్దేశిత విభాగాల్లో అడుగుపెట్టాలంటే ప్రధానంగా సివిల్, మెకానికల్ తదితర కోర్సుల్లో ఉత్తీర్ణులై ఉండాలి. కింది స్థాయిలో ఐటీఐ, డిప్లొమా కోర్సులతోనూ ఈ విభాగంలో అడుగుపెట్టొచ్చు అంటున్నారు జేఎంసీ ప్రాజెక్ట్స్ ఇండియా లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ ఉదయ్‌భాస్కర్.
 
 ఆతిథ్య రంగం.. ఆదాయ మార్గం
 
 నేటి యువతకు మరో చక్కటి ఆదాయ మార్గం ఆతిథ్య రంగం (హాస్పిటాలిటీ). సగటున పది శాతం వృద్ధి రేటుతో సాగుతున్న రంగం. హోటల్స్, టూరిజం ఏజెన్సీలు ఈ రంగంలోని ప్రధాన విభాగాలు. టూరిజం శాఖ అంచనాల ప్రకారం.. ఆతిథ్య రంగంలో 2020 బనాటికి దాదాపు 9 లక్షల మంది నిపుణుల అవసరం ఏర్పడనుంది. ఎన్నో విద్యా సంస్థలు హోటల్ మేనేజ్‌మెంట్‌లో సర్టిఫికెట్ స్థాయి నుంచి పీజీ వరకు కోర్సులను అందిస్తున్నాయి. ఈ కోర్సులు పూర్తి చేస్తే ఉజ్వల భవిష్యత్తు ఖాయం. విభాగం ఆధారంగా నెలకు కనీసం రూ. పది వేల జీతం ఉంటుంది. టూర్ ఆపరేటర్లు, గైడ్లుగా నెలకు రూ. 25 వేల వరకు సంపాదించే అవకాశం ఉంది. టూరిజం విభాగంలో స్వయం ఉపాధి అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు సంబంధిత రంగ నిపుణులు.
 
 టెలికం మేనేజ్‌మెంట్

 
 ప్రభుత్వ నూతన విధానంతో విభిన్న అవకాశాలకు మార్గం వేస్తున్న మరో రంగం టెలికమ్యూనికేషన్స్. సాధారణ టెలిఫోన్స్ సంఖ్య క్రమేణా తగ్గుతూ స్మార్ట్‌ఫోన్ల వినియోగం విస్తరిస్తున్న ప్రస్తుత తరుణంలో టెలికం మేనేజ్‌మెంట్ కచ్చితంగా కొలువు ఖాయం చేసే విభాగమని నిపుణుల అభిప్రాయం. పల్లెపల్లెలో బ్రాడ్ బ్యాండ్ సేవలు విస్తరిస్తుండటం కూడా ఈ రంగంలో ఉపాధికి ఊతమిచ్చేవే. ఈ సేవలు సమర్థంగా సాగాలంటే టెలికం రంగంలో నిపుణుల ఆవశ్యకత ఎంతో. 2020 నాటికి.. దాదాపు పది లక్షల మంది నిపుణుల అవసరం ఏర్పడనుంది. ఈ క్రమంలో ప్రభుత్వం ప్రత్యేకంగా టెలికం సెంటర్ ఫర్ ఎక్సలెన్స్, సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ వైర్‌లెస్ టెక్నాలజీ వంటి ప్రత్యేక శిక్షణ సంస్థలను నెలకొల్పింది. సింబయాసిస్ ఇన్‌స్టిట్యూట్, వెలింగ్‌కర్ ఇన్‌స్టిట్యూట్ వంటి సంస్థలు టెలికం మేనేజ్‌మెంట్ కోర్సులను అందిస్తున్నాయి. దీంతోపాటు ఇంజనీరింగ్ ఈసీఈ అభ్యర్థులు కూడా ఈ రంగంలో అడుగుపెట్టే అవకాశం ఉంది అంటున్నారు సీఎంసీ సంస్థ హెచ్.ఆర్.మేనేజర్ టి. ఓంప్రకాశ్.
 
 మర్చంట్ నేవీ
 
 దేశదేశాలను చూడాలనే ఆకాంక్ష.. సముద్రపు అలలను ఆస్వాదించాలనుకునే వారికి చక్కటి అవకాశం కల్పించే కెరీర్ మర్చంట్ నేవీ. ఏడాదిలో సగభాగం సముద్రంలో.. ఓడల్లో గడిపే ఈ కెరీర్‌కు ఇప్పుడిప్పుడే డిమాండ్ పెరుగుతోంది. కేవలం ఇంటర్మీడియెట్ ఎంపీసీ అర్హతగా మర్చంట్ నేవీలో కెరీర్ ప్రారంభించొచ్చు. మెరైన్ ఇంజనీరింగ్, నాటికల్ సైన్స్, నేవల్ ఆర్కిటెక్చర్ అండ్ షిప్ బిల్డింగ్ వంటి పలు కోర్సులు బీఎస్సీ, బీటెక్ స్థాయిలో అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుత డిమాండ్ ప్రకారం మర్చంట్ నేవీలో వేల సంఖ్యలో అవకాశాలు రెడీగా ఉన్నాయి. ఇతర దేశాలతో పెరుగుతున్న వాణిజ్య ఒప్పందాల దృష్ట్యా.. భవిష్యత్తులో కార్గో షిప్పింగ్ వ్యవహారాలు రెట్టింపై అంతే స్థాయిలో అవకాశాలు కూడా పెరగనున్నాయి. ప్రారంభంలో కనీసం నెలకు రూ. 25 వేల నుంచి రూ. 50 వేల వరకు అందుకోవచ్చు.
 

మరిన్ని వార్తలు