పసుపు అంటేనే పవిత్రం. అలాంటి బంగారాన్నే పండిస్తున్నామనే ధీమా మాలో లేకపాయె. 2006లో మార్కెట్లో క్వింటాల్ రెండున్నర వేలకు కూడా కొంటలేరు. పసుపును ఎందుకు సాగు చేసినమా అనిపించింది. ఈ రేటుకు అమ్మితే పెట్టుబడులు కూడా ఎల్లలేవు. అప్పులే మిగిలేటట్లు ఉండే. ఏం చేయాలో అర్థం కాలే. కాని వై.ఎస్ ఉన్నారన్న ఆశతో హైదరాబాద్ పోయినం. పరిస్థితిని పెద్దాయనకు చెప్పినం. చిరునవ్వుతో విన్నారు. భుజంపై చేయి వేసి తప్పకుండా చేద్దాం అన్నారు.
అన్నట్లే మూడు, నాలుగు రోజుల్లో మార్క్ఫెడ్ వాళ్లు పసుపు సెంటర్ షురూ చేసిండ్రు. నిజామాబాద్ మార్కెట్లో పసుపు కొనుడు స్టార్ట్ చేసిండ్రు. రైతుల కోసం ఏ లీడర్ చేయనిది ఆయన చేసిండు. పసుపు రైతులను ఆదుకున్నందుకు పసుపు కొమ్ముల దండనే వేయాలనిపించింది. మీటింగ్ కోసం నిజామాబాద్కు వచ్చినప్పుడు పెద్దాయనను కలిసి ఆ దండ వేసినం. ఆ క్షణంలో ఆయన పసుపు పూసిన దేవుని లెక్క కనిపించాడు.
– మునిపల్లి సాయిరెడ్డి, మాజీ డీసీఎంఎస్ ఛైర్మన్, నిజామాబాద్.