డెంటల్‌ కేర్‌ లేకుంటే మధుమేహ ముప్పు

20 Mar, 2018 15:50 IST|Sakshi

లండన్‌ : దంత ఆరోగ్యం మెరుగ్గా సంరక్షించుకోకుంటే డయాబెటిస్‌ ముప్పు ముంచుకొస్తుందని తాజా అథ్యయనం హెచ్చరించింది. మధుమేహం నియంత్రణలో లేనివారికి చిగుళ్ల వ్యాధులు, దంత సమస్యలు పెరిగే ప్రమాదం తెలిసిందే. అయినా తాజా అథ్యయనంలో నోటి పరిశుభ్రత లేకుంటే డయాబెటిస్‌ వచ్చే అవకాశం అధికమని వెల్లడైంది. రోగుల దంత పరీక్ష ద్వారా వారికి డయాబెటిస్‌ ముప్పు ఏ మేరకు ఉందనేది అంచనా వేయవచ్చని ప్రస్తుత అథ్యయనానికి నేతృత్వం వహించిన సిటీ ఆఫ్‌ హోప్‌ నేషనల్‌ మెడికల్‌ సెంటర్‌ పరిశోధకులు పేర్కొన్నారు.

20 ఏళ్లు అంతకుపైబడిన 9670 మంది వైద్య రికార్డులు, బాడీమాస్‌ ఇండెక్స​, గ్లూకోజ్‌ టాలరెన్స్‌ స్థాయిలను పరిశీలించి ఈ అంచనాకు వచ్చామని డయాబెటిస్‌, ఎండోక్రినాలజీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ రెనాల్డ్‌ సమోవ చెప్పారు. డెంటల్‌ చెకప్‌కు తమ వద్దకు వచ్చే రోగుల డయాబెటిక్‌ ముప్పును దంత వైద్యులు సులభంగా అంచనా వేసే అవకాశం ఉందని అమెరికన్‌ డయాబెటిస్‌ అసోసియేషన్‌ పేర్కొంది. 

మరిన్ని వార్తలు