‘షమీ దుబాయ్‌లో గడిపాడు'

20 Mar, 2018 15:49 IST|Sakshi

న్యూఢిల్లీ: టీమిండియా పేసర్‌ మహ్మద్‌ షమీ గత నెలలో రెండు రోజుల పాటు దుబాయ్‌లో గడిపిన విషయాన్ని భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ) ధృవీకరించింది. ఈ మేరకు కోల్‌కతా పోలీసులకు షమీ దక్షిణాఫ్రికా పర్యటన గురించి బీసీసీఐ వివరణ ఇస్తూ, అతను దుబాయ్‌లో గడిపిన విషయాన్ని స్పష్టం చేసింది.


దక్షిణాఫ్రికా పర్యటన అనంతరం షమి దుబాయ్‌ వెళ్లాడని, మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు పాల్పడి అక్కడ పాకిస్థాన్‌కు చెందిన అలిష్బా అనే మహిళ నుంచి డబ్బులు తీసుకున్నాడని షమి భార్య హసీన్‌ జహాన్‌ గతంలో ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన కోల్‌కతా పోలీసులు షమి పర్యటన గురించి వివరాలు ఇవ్వాల్సిందిగా బీసీసీఐకి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో తాజాగా కోల్‌కతా పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు బీసీసీఐ జవాబులిచ్చింది. 'బీసీసీఐ నుంచి మాకు లేఖ అందింది. ఫిబ్రవరి 17, 18తేదీల్లో మహమ్మద్‌ షమి దుబాయ్‌లో ఉన్నట్లు లేఖలో బీసీసీఐ అధికారులు పేర్కొన్నారు. దీని ఆధారంగా తదుపరి విచారణ ఉంటుంది'  అని జాయింట్‌ సీపీ ప్రవీణ్‌ త్రిపాఠి తెలిపారు.
 

మరిన్ని వార్తలు