నాతో వచ్చేయ్‌

8 Apr, 2018 00:52 IST|Sakshi

కిర్ర్‌..ర్‌..!

ఇరవై ఏళ్ల వయసులో ఊరి నుంచి వెళ్లిపోయినవాడు, ఇరవై ఏళ్ల తర్వాత ఊళ్లోకి దిగాడు బెనర్జీ. ఊళ్లో బస్సు దిగేటప్పటికి రాత్రి ఒంటి గంట అవుతోంది. అతడిని దించేసి బస్సు ముందుకు వెళ్లిపోయింది. రోడ్డు మీద ఒక్కడే మిగిలాడు.  బస్సులోంచి బెనర్జీ తనొక్కడే దిగాడు. లగేజీలాంటిదేమీ అతడితోపాటు దిగలేదు. ఒంటి మీద ఖరీదైన బ్లూ జీన్స్, టక్‌ చేసిన లేత నీలం రంగు ప్లెయిన్‌ షర్ట్‌. అన్ని గంటల ప్రయాణంలో అవి రెండూ కాస్త అలసిపోయినట్లు అయ్యాయే కానీ, బెనర్జీ మాత్రం బస్సు కుదుపుల్లో ఎక్కడా నలిగినట్లు లేడు. బస్సులోంచి దిగగానే కాసేపటి వరకు అలా నిలబడిపోయాడు బెనర్జీ. వేసవికి ఉక్కపోతగా ఉంది. ఇరవై ఏళ్ల తర్వాత ఉక్కపోస్తున్నట్లుగా ఉంది అతడికి. అప్పుడు గానీ అతడికి ఊళ్లోకి వచ్చిన అనుభూతి కలగలేదు. చిన్నప్పటి చర్చి అలాగే ఉంది. చిన్నప్పటి చెట్లూ అలాగే ఉన్నాయి. చిన్నప్పటి అంటే.. ఇరవై ఏళ్ల క్రితానివని కాదు. అంతకన్నా ముందువి. బెనర్జీకి ఊహ వచ్చిననాటి నుండీ అతడు చూస్తున్నవి. 

ఇన్నేళ్ల తర్వాత అతడు ఊళ్లోకి వచ్చాడే కానీ, ఊళ్లోకి అతడు ఎవరి కోసమూ రాలేదు. తన కోసం తను వచ్చాడు. బెనర్జీ సిటీలో ఉంటాడు. ఎందుకో అతడికి ఊరు గుర్తొచ్చింది. అంతే. వచ్చేశాడు. ఊరంటే అతడికి ఊరే. ఊళ్లోని అమ్మానాన్న కాదు. అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములూ కాదు. బంధువులు కాదు. స్నేహితులు కాదు. చీకట్లో ఊళ్లోకొచ్చి, చీకట్లోనే ఊళ్లోంచి వెళ్లిపోవాలనుకుని వచ్చాడు. ఊళ్లో తననెవరూ చూడకముందే వెళ్లిపోవాలనుకున్నాడు. అందుకు ప్రత్యేకమైన కారణం ఏమీ లేదు. వాళ్లందర్నీ ఇంకోసారి ఎప్పుడైనా తీరిగ్గా చూడొచ్చనుకున్నాడు. ముందైతే ఊరిని చూడాలి.మెల్లిగా ఊళ్లోకి నడక మొదలుపెట్టాడు బెనర్జీ. దారులన్నీ డస్సిపోయినట్లు పడి ఉన్నాయి. మలుపుల్లో ఒకట్రెండు కుక్కలు బెనర్జీ వైపు తలెత్తి చూసి, మొరిగే ఓపికలేనట్లుగా తిరిగి పడుకున్నాయి. ఊళ్లో నడకయ్యాక ఊరి చెరువు దగ్గరికి చేరుకున్నాడు బెనర్జీ. చెరువుగట్టున చిన్నప్పటి మర్రిచెట్టు అలాగే ఉంది. వెళ్లి ఆ మర్రిచెట్టు కింద కూర్చున్నాడు. అది వట్టి మర్రి కాదు. ఊడలమర్రి. అతడిని కనుక ఆ సమయంలో అలా ఎవరైనా చూస్తే..  మనిషి అని మాత్రం అనుకోరు. 

టైమ్‌ చూసుకున్నాడు బెనర్జీ. మూడయింది. మర్రిచెట్టు కింది నుంచి అతడికి లేవాలనిపించడం లేదు. బాల్యంలో ఆ ఊడలు చూస్తే అతడికి భయం. యవ్వనంలో ఆశ్చర్యం. ఇప్పుడు భయమూ లేదు, ఆశ్చర్యమూ లేదు. మర్రిచెట్టుకు కాస్త దూరంలో శ్మశానం ఉంటుంది. అమావాస్య రాత్రిళ్లల్లో ఆ శ్మశానంలోంచి దెయ్యాలొచ్చి ఈ ఊడలకు వేలాడుతూ కష్టం సుఖం చెప్పుకునేవని ఊళ్లోవాళ్లు అనుకునేవారు. అది గుర్తొచ్చి బెనర్జీకి నవ్వొచ్చింది. ఆ రోజు అమావాస్యేమో అతడికి తెలీదు. బాగా చీకటిగా మాత్రం ఉంది. కాసేపు కళ్లు మూసుకున్నాడు బెనర్జీ. అలా ఎంతసేపు ఉండిపోయాడో తెలీదు. ఏదో అలికిడి అయినట్లనిపిస్తే కళ్లు తెరిచాడు. ఎదురుగా.. ఎవరో పెద్దావిడ. చెరువులో ముంచుకొచ్చిన నీళ్ల బిందె ఆమె చేతుల్లో ఉంది. ‘‘ఏయ్యా.. బెనర్జీ.. ఎప్పుడొచ్చా! బాగున్నావా? నువ్వు బెనర్జీవే కదా. ఇంత రాత్రప్పుడు ఇక్కడేమిటీ?’’ అంటోంది. కొన్ని క్షణాలకు గానీ ఆమెను పోల్చుకోలేక పోయాడు బెనర్జీ. చప్పున లేచి నిలబడ్డాడు. ఆమె కళ్లల్లో ఆపేక్ష. ‘ఎన్నాళ్లయింది నాయనా.. నిన్ను చూసి’ అన్నట్టుగా చూస్తోంది. బెనర్జీ ఆమెనే చూస్తున్నాడు. ‘‘సిటీకి వెళ్లిపోయావంట.. అమ్మకీ నాయినకీ చెప్పకుండా! మంచిదేలే. నాయిన ఎంత సంపాదించినా మగ పిల్లోడు వాడి కాళ్ల మీద వాడు బతికితేనే కదా గౌరవం’’ అంది. ఇంకా.. ఒకట్రెండు మాటలు మాట్లాడింది.  వెళ్లేటప్పుడు.. ‘‘ఇంక వెళ్తాను నాయనా.. తెల్లారితే పనులు తెమలవు’’ అని చెప్పి వెళ్లింది. అంతసేపూ బెనర్జీ మౌనంగానే ఉన్నాడు. ఆమె వెళ్లాక టైమ్‌ చూసుకున్నాడు. నాలుగు అవుతోంది.

ముందైతే.. బస్టాండ్‌కి వెళ్లిపోయి, అక్కణ్ణుంచి ఏదో ఒక బస్‌ ఎక్కేసి, అక్కడినుంచి సిటీకి వెళ్లిపోదాం అనుకున్నాడు బెనర్జీ. అయితే అతడికి శేఖర్‌ని కలవకుండా వెళ్లడం కరెక్ట్‌ కాదనిపించింది. ఊరి చెరువులా, ఊడల మర్రిలా.. బెనర్జీకి శేఖర్‌ కూడా ఒకడు! బెస్ట్‌ ఫ్రెండ్‌. అయితే బెనర్జీ ఊరొదలడానికి ముందే, బెనర్జీతో శేఖర్‌ స్నేహం వదిలిపోయింది! ‘ఊళ్లో ఉండి ఏం చేస్తావ్‌? నాతో వచ్చేయ్‌’ అని అన్నాడు బెనర్జీ.. ఊరొదిలి వచ్చేడానికి ముందు రోజు. ఆ మాటకు శేఖర్‌ ఏమన్నాడో, అందుకు బెనర్జీ ఏమన్నాడో.. బెనర్జీ మర్చిపోలేదు. ఆ తర్వాతెప్పుడూ బెనర్జీ, శేఖర్‌ ఒకర్నొకరు చూసుకోలేదు. ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు. ఇద్దరి నెంబర్లూ ఇద్దరి దగ్గరా ఉన్నాయి. ఈ ఇరవై ఏళ్లలో ఏ నెంబర్‌ నుంచీ ఏ నెంబర్‌కీ ఫోన్‌ వెళ్లలేదు. 
 
‘‘ఒరే.. బెనర్జీ! నువ్వా! ఏమిటిలా? ఇంత ఉదయాన్నే! ఎప్పుడొచ్చావ్‌రా’’ అన్నాడు శేఖర్, బెనర్జీని ఇంట్లోకి రమ్మంటూ. బెనర్జీ వెళ్లలేదు. ‘వెళ్లిపోతాను’ అన్నాడు. ‘‘ఇంట్లో అంతా బాగానే ఉన్నారా?!’ అన్నాడు శేఖర్‌. ‘‘ఇంటికి వెళ్లలేదు. ఊరు చూసి వెళ్దామని వచ్చాను. చూశాను. వెళ్తున్నాను. నిన్ను చూసి వెళ్దామని వచ్చాను’’ అన్నాడు బెనర్జీ. శేఖర్‌కి ఏమీ అర్థం కావడం లేదు. ‘‘మీ ఇంట్లోవాళ్లను చూడకుండా.. నన్ను చూడడం ఏంట్రా?’’ అన్నాడు. ‘‘నీకు సారీ చెబ్దామని వచ్చాను’’ అన్నాడు బెనర్జీ.‘దేనికి?’ అన్నట్లు చూశాడు శేఖర్‌. బెనర్జీ కళ్లు తుడుచుకున్నాడు. శేఖర్‌ కంగారు పడ్డాడు. ‘‘ఒరే శేఖర్‌.. ‘ఊళ్లో ఉండి ఏం చేస్తావ్‌? నాతో వచ్చేయ్‌’ అన్నప్పుడు నువ్వేమన్నావ్‌! ‘తల్లి లాంటి ఊరిని వదిలి రాలేనురా’ అనే కదా. అప్పుడు నేనేమన్నాను? ‘తల్లే పోయాక, తల్లిలాంటి ఊరేమిట్రా’అన్నాను కదా’’ అన్నాడు బెనర్జీ.‘‘అంటే ఏమైందిరా?’’ అన్నాడు శేఖర్‌. ‘‘అలా అన్నందుకు.. సారీ..రా’’.. అని శేఖర్‌ చేతిని కళ్లకు తాకించుకుని, వెంటనే అక్కడి నుంచి ఆ చీకట్లో బస్టాండ్‌కి బయల్దేరాడు బెనర్జీ.ఆ రాత్రి ఊడలమర్రి దగ్గర శేఖర్‌ తల్లి తనకు కనిపించిన విషయాన్ని అతడు తన మనసులోనే ఉంచేసుకున్నాడు. 

- మాధవ్‌ శింగరాజు 

మరిన్ని వార్తలు