సంస్కరణల చుట్టూ మోదీ చక్కర్లు

21 Jan, 2018 02:04 IST|Sakshi

♦ అవలోకనం 
చెత్త పారేయడం అనేది వికారమైనది, చికాకు పరిచేది. అయితే ప్రజారోగ్య సమస్య వలే ఇది జాతీయ సమస్యేమీ కాదు. ప్రజారోగ్య లోపంతో మన పిల్లల్లో 38 శాతంమందికి రెండేళ్ల వయసులోనే ఎదుగుదల ఆగిపోతోంది. కానీ మోదీ దృష్టి, ఆయనిచ్చిన సందేశం పూర్తిగా చెత్త వేయడం వల్ల కలిగే అనర్ధాలపైనే కేంద్రీకరించి ఉంది. దేశ పౌరుల వ్యక్తిత్వంలో మార్పు తీసుకురావాలన్నదే ఆయన ఉద్దేశం. అందుకు ప్రవర్తనాపరమైన మార్పు...అంతర్గతమైన పరివర్తన అవసరమన్నది ఆయన భావన.

‘మీరు విప్లవ నాయకుడు. భారతదేశంలో విప్లవాత్మక మార్పు తెస్తున్నారు. ఈ మహత్తరమైన దేశాన్ని భవిష్యత్కాలానికి తీసుకెళ్తున్నారు’. ఈ వారం మన దేశా నికొచ్చిన ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు మన ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి మాట్లాడిన మాటలివి. ఆయన మాటల్లోని అంతరార్ధం ఏమై ఉంటుంది? నా దగ్గరున్న నిఘంటువు ‘ఒక సంపూర్ణమైన, ఆకస్మికమైన పరివర్తన ఇమిడి ఉండేదానినే’ విప్లవంగా చెబుతోంది. సుస్థాపితమైన వ్యవస్థకు, ప్రత్యేకించి ఒక రాజ్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటువంటి చర్యను ఈ విప్లవ నాయకులు కోరుకుంటారు. భారత రాజ్యాన్ని నెతన్యాహు ‘మహత్తరమైనద’ంటున్నారు గనుక (ఆయన ఎందుకలా అనుకుంటున్నారన్నది నాకు ఆసక్తికరం) మోదీ ఆ వ్యవస్థను «కూలదోస్తున్నారని నెతన్యాహు అనుకోవడం లేదని మనం అర్ధం చేసుకోవచ్చు.

మరి ఆయన చెప్పదల్చుకున్నదేమిటి? ఆ సంగతి నిజంగా తెలియదు, ఊహించే ప్రయత్నం కూడా చేయను. ప్రశంసలకు సులభంగా పడిపోయే ఒక కొనుగోలు దారుకు ఆయుధాలు అమ్మేందుకు నెతన్యాహు వచ్చారనే వాస్తవాన్ని కాసేపు పక్కన పెడదాం. ఒక రకంగా వ్యవస్థలో విప్లవాత్మక మార్పును మోదీ తీసుకు రాదల్చుకున్నారన్నది వాస్తవం. ఏమిటా మార్పు? నేను దీన్ని సంస్కరణ అంటాను... అలాగని దాన్ని వాడుకలో ఉన్న అర్ధంతో నేను ఉపయోగించడం లేదు. ఉదాహరణకు మోదీ పథకాల్లో ఒకటైన స్వచ్ఛభారత్‌ అభియాన్‌ తీసు కుందాం. అది ఎంత ఆర్భాటంగా ప్రారంభమైందో అందరికీ గుర్తుండే ఉంటుంది. మోదీ స్వయంగా చీపురు పట్టుకుని రోడ్డును పరిశుభ్రపరిచారు. ఇతరుల్ని కూడా అలా చేయమని ప్రోత్సహించారు. వాటిపై ట్వీట్‌లు చేశారు. స్వచ్ఛ భారత్‌ పర మార్ధమేమిటో, అది ఏ ప్రయోజనాన్ని ఆశిస్తున్నదో ఆయన వెబ్‌సైట్‌ వివరిం చింది.

‘2019లో జరగబోయే మహాత్మా గాంధీ 150వ జయంతికి మనం అర్పించ గల అత్యుత్తమ నివాళి స్వచ్ఛ భారత్‌... మహాత్మా గాంధీ కలలుగన్న స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన భారతదేశాన్ని సాకారం చేయడానికి ముందుకు రావాలని ప్రజ లకు ప్రధాని ఉద్బోధించారు. మందిర్‌ మార్గ్‌ పోలీస్‌స్టేషన్‌ వద్ద నరేంద్ర మోదీయే స్వయంగా ఈ కార్యక్రమానికి అంకురార్పణ చేశారు. చెత్తను ఊడ్చడానికి చీపురు పట్టుకుని ఈ దేశవ్యాప్త ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించారు. చెత్తాచెదారాన్ని వేయొద్దు, ఎవరినీ వేయనీయొద్దు అని ఆయన పిలుపునిచ్చారు. ‘చెత్తవేయను, ఎవరినీ వేయనీయను’ అనే మంత్రోపదేశం చేశారు’ అని ఆ వెబ్‌సైట్‌ చెబుతోంది. పీఠికలో ఆయన పరిశుభ్రత, స్వచ్ఛత, చెత్త, చెత్త పారేయడం అనే పదాలను 21 సార్లు ఉపయోగించారు. మరుగుదొడ్డి, ప్రజారోగ్య పరిరక్షణ పదాలు మాత్రం ‘భారతీయ కుటుంబాల్లో దాదాపు సగభాగం ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్య లకు కారణం వారి ఇళ్లలో మరుగుదొడ్లు లేకపోవడమే...’ అని చెప్పిన సందర్భంలో ఒక్కసారి వచ్చాయి. తొలుత నిర్ణయించుకున్న కార్యక్రమాలకు కొన సాగింపుగా దీన్ని చేర్చాలని తర్వాత అనుకోవడం వల్లే ఇలా జరిగి ఉండొచ్చు.

చెత్త పారేయడం అనేది వికారమైనది, చికాకు పరిచేది. ప్రజారోగ్య పరిరక్షణ వలే ఇది జాతీయ సమస్యేమీ కాదు. ప్రజారోగ్య లోపంవల్ల మన పిల్లల్లో 38 శాతం మందికి రెండేళ్ల వయసులోనే ఎదుగుదల ఆగిపోతోంది. కానీ మోదీ దృష్టి, ఆయని చ్చిన సందేశం పూర్తిగా చెత్తపైనే కేంద్రీకరించి ఉంది. దేశ పౌరుల వ్యక్తిత్వంలో మార్పు తీసుకురావాలన్నదే ఆయన ఉద్దేశం. అందుకు ప్రవర్తనాపరమైన మార్పు.. అంతర్గతమైన పరివర్తన అవసరమన్నది ఆయన భావన. ఇది ఆధ్యాత్మికవేత్తలు, మత నాయకులు చెప్పే సంస్కారం లాంటిది. ఇది అందరికీ తెలిసిన రాజకీయా  లకు సంబంధించింది కాదు.

పెద్ద నోట్ల రద్దు వంటి విపరీత నిర్ణయాలకు స్ఫూర్తి ఇలాంటి సంఘ సంస్కరణ కోణం నుంచే ఎవరైనా చూడాల్సి ఉంటుంది. భారతీ యులను నల్లడబ్బుకు దూరం చేసితీరాలి. ఇది చేయాలంటే బలవంతంగానైనా వారి ప్రవర్తనను మార్చడం, వారి దగ్గరున్న డబ్బు గుంజుకోవడమే మార్గం. ఇది అంతిమంగా ప్రభావశీలమైనదైనా, కాకపోయినా... ఇది లక్షలాదిమందిపై వ్యతి రేక ప్రభావం చూపినా, చూపకపోయినా... ఈ కఠినమైన విధానంవల్ల జనం ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి ఏర్పడినా–వాటన్నిటినీ ఆ తర్వాత నిపుణులు చర్చించుకుంటారు. ఆయన చేసి తీరాలనుకున్నారు. తాను సరైనదని అనుకున్నదా నిని ప్రజలతో బలవంతంగా చేయించారు. జనాదరణ ఉన్న మోదీ లాంటి నేత అమలుచేసిన సంస్కరణ ఇది. 

బాలీవుడ్‌ దర్శకుడు మాధుర్‌ భండార్కర్‌ ఈమధ్య ‘ఒక ప్రధాని సంఘ సంస్కర్తగా మారినప్పుడు’ అనే శీర్షికతో ఒక పత్రికలో వ్యాసం రాస్తూ ఇలాంటి కోణాలనే స్పృశించారు. ‘మన సమాజం ఎంత గొప్ప పరివర్తనకు లోనవుతున్నదో చెప్పడానికి అనేక ఉదాహరణలున్నాయి. యోగాను ప్రజల వద్దకు తీసుకెళ్లడం, వీఐపీ సంస్కృతిని అంతం చేయడం కోసం కార్లపై ఎర్రరంగు లైట్లను నిషేధిం చడం, దివ్యాంగులకు ప్రత్యేక పథకాలు తీసుకురావడం, వారి అవసరాల గురించి ప్రజల్లో అవగాహన ఏర్పర్చడం, గెజిటెడ్‌ అధికారుల నుంచి ధ్రువీకరణ పత్రాలు పొందడానికి వారి సంతకాల కోసం తిరిగే స్థితి లేకుండా చేయడం, కంపోస్టింగ్‌ ద్వారా సొంతంగా ఎరువు తయారుచేసుకోమని ప్రజలకు ఉద్బోధించడం– ఇలాంటి పథకాలన్నీ చిన్నవిగానే కనబడొచ్చు.

కానీ అవి కలగజేసే ప్రభావం తీవ్రమైనది’ అని భండార్కర్‌ రాశారు. ఇవి దేశ ప్రధాని స్థాయిలోనివారు పట్టించు కోవాల్సినవా అన్న కోణంలో నేను దీన్ని చూడటం లేదు. మోదీ ఇలాంటి సామా జిక మార్పుపై ఆరాటపడుతున్నారన్నదే నా వాదన. ఏదైనా అంశం విషయంలో పొరబడి ఉండొచ్చు లేదా తొందరపాటుతో చేసి ఉండొచ్చని కొన్నిసార్లు ఆయనకు అనిపించవచ్చు. ఇవ్వాళ్టి స్వచ్ఛభారత్‌ వెబ్‌సైట్లలో మరుగుదొడ్లు, ప్రజారోగ్య పరి రక్షణ ప్రాధాన్యతా స్థానంలో ఉన్నాయి. చెత్త పారేయడం గురించి చెప్పడం చాలా స్వల్పంగా ఉంటుంది. నెతన్యాహు ప్రశంసకు మోదీ జవాబిస్తూ ‘ఫలితాల సాధన విషయంలో చాలా అసహనంతో ఉంటానని నాకు పేరొచ్చింది. మీరు కూడా అంతే’ అన్నారు. మనల్ని సంస్కరించాలన్న ఆయన ప్రయత్నాలు ఇకపై కూడా కొనసాగుతాయని మనం భావించాలి.


ఆకార్‌ పటేల్‌
వ్యాసకర్త కాలమిస్టు, రచయిత 

aakar.patel@icloud.com

మరిన్ని వార్తలు