‘ఇపుడు తెలంగాణకు కావాల్సింది విద్యే’

17 May, 2018 03:00 IST|Sakshi
ప్రతికాత్మక చిత్రం

సివిల్స్‌ పరీక్షలో అఖిల భారతస్థాయిలో ప్రథమర్యాంకు సాధించిన దురిశెట్టి అనుదీప్‌ను ఆత్మీయ ఆలింగనం చేసుకుని అభినందిస్తూ గొప్ప ఐఏఎస్‌ కావాలని సీఎం కేసీఆర్‌ చేసిన ప్రకటన  ఆనందింపచేసింది. సివిల్స్‌లో కీర్తి కిరీటాన్ని మెట్‌పల్లి మట్టికాళ్ల దాకా తీసుకవచ్చి తెలంగాణ ఖ్యాతిని పెంచటంలో అనుదీప్‌ కృషి అభినందించతగింది. తెలంగాణ వచ్చాక చదువుల రంగం కూడా మున్నెన్నడూ లేని విధంగా పురోగమిస్తోంది. పాఠశాల స్థాయి నుంచి నాణ్యమైన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి భవిష్యత్తులో వందలమంది అనుదీప్‌లు తయారయ్యేందుకు బాటలు వేసి తీరటం ఖాయం. తెలంగాణ రాష్ట్రం వచ్చాక గురుకుల విద్యాలయాలు 815 అయ్యాయి. ఒక్కొక్క విద్యార్థిపై ఏటా ఒక లక్ష రూపాయలు వెచ్చిస్తున్నారు. పేదపిల్లలకు కార్పోరేట్‌ విద్యాసంస్థలను తలదన్నే విధంగా చదువు, సౌలభ్యాలు, మౌలిక వసతులు లభిస్తున్నాయి. దాని వల్లనే తొలి సారిగా కార్పోరేట్‌ విద్యాసంస్థల పాతర్యాంకుల చరిత్రను తలకిందులు చేస్తూ ఇంటర్‌ ఫలితాల్లో ప్రభుత్వ విద్యాసంస్థలు అగ్రస్థానం సాధిస్తున్నాయి. ఇది తెలంగాణ ప్రభుత్వం గురుకుల విద్యాలయాల ద్వారా చేస్తున్న నిశ్శబ్ద విప్లవం.

జాతీయస్థాయిలో యువతకు ఆదర్శంగా అనుదీప్‌ నిలిచినందుకు అభినందించటమే గాకుండా  సివిల్స్‌ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణను ఇప్పించేం దుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేయబోతుంది. మౌఖిక పరీక్షకు ఎంపిౖకైన రాష్ట్ర అభ్యర్థులకు ఢిల్లీలో నిపుణులతో తర్ఫీదు ఇప్పిస్తానని కేసీఆర్‌ ప్రకటిం చారు. ఇది బహుజన పిల్లలకు వరంగా మారుతుంది. ఈ ఫలితాలను క్రమంగా మరో ఐదు, పదేళ్లలో తెలంగాణ చూస్తుంది.
తెలంగాణకు సేవచేయాలన్నదే తనధ్యేయమని అనుదీప్‌ చెప్పడం ఆహ్వానించతగింది. ఇపుడు తెలం గాణకు కావాల్సింది ఈ నేలను సస్యశ్యామలం చేసే జ్ఞానార్జన. తెలంగాణ వస్తే ఏమొస్తుందంటే ఈ మట్టిని దున్నుకుంటూ పోతే వందలమంది అనుదీప్‌లు వస్తారని తేలింది. భవిష్యత్‌ తెలంగాణ రూపురేఖలు గురుకుల విద్యాలయాల నుంచే రూపొందుతాయి. గురుకుల విద్యాలయాలను బహుజనుల రక్షణ కవచాలుగా మార్చుకోవాలి. 

జూలూరు గౌరీశంకర్, తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్‌ సభ్యులు
94401 69896 

మరిన్ని వార్తలు