కీసరగుట్టలో శివరాత్రి ఏర్పాట్లు పూర్తి: జేసీ రజత్

1 Mar, 2016 19:40 IST|Sakshi

మార్చి 5 నుంచి 10 వ తేది వరకు జరిగే కీసరగుట్ట మహా శివరాత్రి బ్రహోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా ఇన్‌చార్జ్ జాయింట్ కలెక్టర్ రజత్‌కుమార్ సైనీ అన్నారు. మంగళవారం ఆయన ఆర్డీవో ప్రభాకర్‌రెడ్డి, ఆలయ చైర్మన్ తటాకం ఉమాపతిశర్మ, వివిధ శాఖల అధికారులతో కలసి కీసరగుట్టలో ఏర్పాట్లను పరిశీలించారు.

అనంతరం కీసరగుట్ట జాతరను విజయవంతం చేసేందుకు గాను ఏర్పాటు చేసిన వివిధ కమిటీల పనితీరును సమీక్షించారు. భక్తులు గుట్టకు చేరుకొని స్వామిని దర్శించుకొని ప్రశాంతంగా తిరుగు ప్రయాణం అయ్యేంత వరకు వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరపాలని జేసీ ఆదేశించారు. రాజధానికి చేరువలో కీసరగుట్ట ఉన్నందున బ్రహ్మోత్సవాలకు లక్షల సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని ఈ మేరకు ఏర్పాట్లు చేశామన్నారు.

 

మరిన్ని వార్తలు