కార్బైడ్ వాడితే.. ఆరునెలల జైలు

2 Mar, 2016 19:42 IST|Sakshi

హైదరాబాద్: కాల్షియం కార్బైడ్ రసాయనాన్ని వినియోగించి కృత్రిమంగా పండ్లు మగ్గ పెట్టే వ్యాపారులపై కఠిన చర్యలుంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. హై కోర్టు ఆదేశాల మేరకు.. కాల్షియం కార్బైడ్ వినియోగంతో జరిగే అనర్థాలపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, సమాచార, పౌర సంబంధాల శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్ బుధవారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు.

కృత్రిమంగా పండ్లు మగ్గ పెట్టే వ్యాపారులకు ఆరు నెలల జైలు శిక్షతో పాటు, లక్ష రూపాయల జరిమానా విధించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.కృత్రిమంగా మగ్గ పెట్టిన పండ్లను తినడం ద్వారా కాన్సర్‌తో పాటు జీర్ణ, శ్వాసకోశ సంబంధ వ్యాధులు వస్తాయన్నారు. ఈ అంశంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు షార్ట్ ఫిల్మ్‌లు, ఇతర ప్రచార సామగ్రి సిద్దం చేస్తున్నట్లు వెల్లడించారు.

పండ్లను మగ్గ పెట్టేందుకు రూ.60 లక్షల వ్యయంతో గడ్డి అన్నారం పండ్ల మార్కెట్‌లో ఇథిలీన్ చాంబర్‌ను మార్కెటింగ్ శాఖ నిర్మిస్తోందని తెలిపారు. ఆరుగురు వ్యాపారులు సొంతంగా ఇథిలీన్ ఛాంబర్ల నిర్మాణానికి ముందుకు వచ్చారని.. మార్చి ఆఖరులోగా వినియోగంలోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ప్రై వేటు రంగంలో రాష్ట్ర వ్యాప్తంగా 80 ఇథిలీన్ ఛాంబర్లు వుండగా.. అవసరమైన చోట వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో నిర్మాణానికి ఆదేశాలు జారీ చేశామన్నారు.

 

మరిన్ని వార్తలు