భర్తను కాపాడబోయి మంటల్లో చిక్కుకున్న భార్య

27 Dec, 2015 17:19 IST|Sakshi

గుత్తి (అనంతపురం) : అతిగా మద్యం తాగిన భర్త ఒంటిపై కిరోసిన్ పొసుకుని నిప్పంటించుకున్నాడు. ఇది గుర్తించిన భార్య అతన్ని కాపాడటానికి ప్రయత్నించి మంటల్లో చిక్కుకుంది. గమనించిన స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించగా.. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఈ సంఘటన అనంతపురం జిల్లా గుత్తి మండల కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది. నెల్లూరుకు చెందిన మునికృష్ణ(32) ,గౌరి(28) భార్యాభర్తలు. కొన్నేళ్ల కిందట గుత్తికి వచ్చి స్థిరపడ్డారు. మునికృష్ణ ప్రైవేట్ ట్రావెల్స్‌లో డ్రైవర్‌గా పని చేస్తూ.. మద్యానికి బానిసయ్యాడు.

ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. కాగా ఆదివారం మద్యం సేవించిన మునికృష్ణ స్నేహితులను వెంటపెట్టుకొని ఇంటికి వచ్చి మళ్లీ మద్యం తాగుతున్నాడు. ఇది చూసిన గౌరి అతని మీద కేకలు వేసింది. దీంతో కోపోద్రిక్తుడైన మునికృష్ణ ఇంట్లో ఉన్న కిరోసిన్‌ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఇది చూసిన స్నేహితులు పారిపోగా.. భార్య అతన్ని కాపాడటానికి ప్రయత్నించి మంటల్లో చిక్కుకుంది. ఇది గమనించిన స్థానికులు మంటలు ఆర్పి వారిని ఆస్పత్రికి తరలించారు. కాగా.. దాదాపు 80 శాతం శరీరాలు కాలిపోయాయని వైద్యులు తెలిపారు.

>
మరిన్ని వార్తలు