ఏపీ ఎంసెట్‌కు నగరంలోనూ కేంద్రాలు

16 Mar, 2016 00:17 IST|Sakshi
ఏపీ ఎంసెట్‌కు నగరంలోనూ కేంద్రాలు

వెల్లడించిన సెట్ కన్వీనర్ సాయిబాబు
 
 సాక్షి, హైదరాబాద్ /బాలాజీచెరువు(కాకినాడ): ఏపీ ఎంసెట్‌కు ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లోనూ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఎంసెట్ కన్వీనర్ డాక్టర్ సీహెచ్.సాయిబాబు తెలిపారు. హైదరాబాద్‌లోని మెహిదీపట్నం, టోలిచౌకి, గోల్కొండ, లంగర్‌హౌజ్, ఇబ్రహీంబాగ్, గండిపేట, రాయదుర్గం, షేక్‌పేట, గచ్చిబౌలి ప్రాంతాలు జోన్-ఏ పరిధిలో, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, ప్రగతినగర్, నిజాంపేట్, బాచుపల్లి, చందానగర్, బీహెచ్‌ఈఎల్, పటాన్‌చెరు, కండ్లకోయ, జీడిమెట్ల, గండిమైసమ్మ, దూలపల్లి, గుండ్లపోచంపల్లి, దుండిగల్ ప్రాంతాలను జోన్-బీ పరిధిలో ఉన్నాయని వివరించారు. అభ్యర్థుల సంఖ్యను బట్టి పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.

 ఎంసెట్ నిర్వహణకు సకల చర్యలు
 ఎంసెట్ నిర్వహణలో లోపాలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని కన్వీనర్ సీహెచ్.సాయిబాబు తెలిపారు. కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా కట్టుదిట్టమైన నిఘా పెడుతున్నట్లు వివరించారు. ఇంటర్మీడియెట్ హాల్ టికెట్ నంబర్‌ను తప్పుగా నమోదు చేసిన విద్యార్థులు సీనియర్ ఇంటర్మీడియెట్ హాల్‌టికెట్ నంబర్‌ను ఎంసెట్ ఈమెయిల్ (apeamcet2k16@ gmail.com)కు ఈనెల 20వ తేదీలోగా పంపించాలని సూచించారు. ఈ విషయాన్ని అభ్యర్థులందరికీ సంక్షిప్త సమాచారం అందించామన్నారు. హాల్ టికెట్ నంబర్‌ను సరిచేయించుకోకపోతే వారు ఎంసెట్ హాల్ టిక్కెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోలేరని వివరించారు.

 ఏప్రిల్ 3 నుంచి 9 వరకు సవరణలకు అవకాశం
 ఆన్‌లైన్ దరఖాస్తుల్లో సమాచారం పొందుపర్చడంలో జరిగిన పొరపాట్లను సరిచేసుకోవడానికి ఏప్రిల్ 3 నుంచి 9వ తేదీ వరకు అవకాశం కల్పిస్తున్నట్లు కన్వీనర్ చెప్పారు. ఎంసెట్ హాల్ టికెట్లను ఏప్రిల్ 21 నుంచి 27వ తేదీ వరకు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే 0884-2340535, 0884-2356255 నంబర్లలో సంప్రదించవచ్చని సాయిబాబు సూచించారు.

మరిన్ని వార్తలు