సాక్షి, హైదరాబాద్: బాబ్లీప్రాజెక్టు పర్యవేక్షణ కమిటీలో తమకు చోటు కల్పించాలన్న తెలంగాణ, ఏపీ రాష్ట్రాల పిటిషన్లపై ఈ నెల 10న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. బాబ్లీ ప్రాజెక్టు వివాద పరిష్కారం సందర్భంగా తామిచ్చిన తీర్పును సజావుగా అమలు చేసేందుకు కేంద్రం, మహారాష్ట్ర, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని అధికారులతో కలిపి ఓ పర్యవేక్షణ కమిటీని సుప్రీం ఏర్పాటు చేసింది.
రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణకు ఇందులో చోటివ్వాలని కోరుతూ కేంద్రం పిటిషన్ దాఖలు చేయగా సుప్రీం కోర్టు తెలంగాణ, ఏపీలకు నోటీసులు జారీ చే సింది. దీనిపై తన వాదనలు వినిపించిన ఆంధ్రప్రదేశ్ తమనూ కమిటీలో కొనసాగించాలని, శ్రీరాంసాగర్ వరకు వచ్చే వరద జలాలపై తమకూ అధికారం ఉందని చెబుతోంది. అయితే బాబ్లీ వివాదంతో ఏపీకి ఎలాంటి సంబంధం లేనందున ఆ రాష్ట్రాన్ని తొలగించి తమను చేర్చాలని తెలంగాణ వాదిస్తోంది.