హైదరాబాద్ : ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్యూ) విద్యార్ధి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్కు ఏదైనా జరిగితే అందుకు కేంద్రప్రభుత్వమే బాధ్యత వహించాలని సీపీఐ కేంద్ర కార్యదర్శివర్గ సభ్యుడు కె.నారాయణ హెచ్చరించారు. కన్హయ్య ఎక్కడికి వెళితే అక్కడ బీజేపీ అనుబంధ విద్యార్ధి సంఘం- ఏబీవీపీ కార్యకర్తలు, సంఘ్పరివార్ దాడులు పరిపాటిగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడైనా మీటింగ్లు పెట్టుకునే హక్కుందని, దాడులు, అల్లర్లతో కన్హయ్య నోరు నొక్కాలని చూస్తే బీజేపీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఢిల్లీ మొదలు పూణే వరకు అడుగడుగునా కన్హయ్య సభలకు ఆటంకాలు కల్పిస్తూ అల్లర్లు సృష్టిస్తున్న తీరును ఖండించారు. ఇపుడు ఏకంగా తుపాకులు, తూటాలతో బెదిరింపులు చేస్తున్నారని.. ఢిల్లీ జేఎన్యూ బస్లో తుపాకులు, తూటాలున్న సంచితో పాటు కన్హయ్యను హత మారుస్తామంటూ రాసిన బెదిరింపు లేఖ పోలీసులకు దొరికిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు.