దొంగ క్రెడిట్ కార్డుల ముఠా అరెస్ట్

25 Jun, 2016 21:34 IST|Sakshi

సనత్‌నగర్: ఐసీఐసీఐ బ్యాంక్‌కు వచ్చే దరఖాస్తుదారులకు తెలియకుండా వారి చిరునామాల ఆధారంగా పొందిన ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులతో రూ. 20 లక్షలు షాపింగ్ చేసి మోసానికి పాల్పడిన ముగ్గురు ముఠా సభ్యులను బేగంపేట్ పోలీసులు శనివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బేగంపేట్ ఎస్‌ఐ రాంచందర్ తెలిపిన వివరాల ప్రకారం...చందానగర్ పాపిరెడ్డికాలనీకి చెందిన సారధికుమార్ (42) గచ్చిబౌలి నానక్‌రామ్‌గూడలోని ఐసీఐసీఐ టవర్స్‌లో డాటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు.

ఈ క్రమంలో అతను దరఖాస్తుదారుల చిరునామాలపై ఎస్‌బీఐ క్రెడిట్‌కార్డుకు ఆప్లై చేసి కార్డులు తీసుకునేవాడు. ఇలా 22 మంది పేర్లపై తీసుకున్న కార్డులతో రూ. 22.95 లక్షలు షాపింగ్ చేశాడు. క్రెడిట్ కార్డులపై ఉన్న చిరునామాల్లో ఉండే వ్యక్తులను కలిసి షాపింగ్ కోసం చేసిన మొత్తాన్ని చెల్లించాలని ఎస్‌బీఐ సిబ్బంది కోరడంతో బాధితులు తాము కార్డు తీసుకోలేదని చెప్పారు. దీంతో ఎస్‌బీఐ క్రెడిట్ అండ్ పేమెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సీనియర్ మేనేజర్ విశాల్ విన్సెంట్ మే 26న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్‌స్పెక్టర్ జగన్ నేతృత్వంలో ఎస్‌ఐ రాంచందర్ దర్యాప్తు చేపట్టి సారథికుమార్ ఈ మోసానికి సూత్రధారిగా గుర్తించారు. అతనికి సహకరించిన నామాలగుండుకు చెందిన వీరబాబును గతంలోనే అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న శివచంద్ర, నర్సింహరావు, ఉపేంద్రలను శనివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

మరిన్ని వార్తలు