క్రికెట్ బెట్టింగ్ అడ్డాపై పోలీసుల దాడి

8 May, 2016 01:29 IST|Sakshi

ఎనిమిది మంది అరెస్ట్  రూ.1.49 లక్షలు స్వాధీనం
 
కుత్బుల్లాపూర్: క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న ఓ అడ్డాపై సైబరాబాద్ ఎస్‌ఓటీ పోలీసులు దాడి చేసి ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.1.49 లక్షలు స్వాధీనం చేసుకున్న ఘటన పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఓటీ, పోలీసుల కథనం ప్రకారం.. పద్మానగర్ రింగ్ రోడ్డు వద్ద కొంత కాలంగా క్రికెట్ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారముంది. దీంతో పక్కా ప్రణాళికతో సైబరాబాద్ ఎస్‌ఓటీ పోలీసులు రంగంలోకి దిగి శనివారం సాయంత్రం 5.30 సమయంలో బెట్టింగ్‌లకు పాల్పడుతున్న 8 మందిని వలపన్ని పట్టుకున్నారు.

ఎన్.సుబ్బారెడ్డి(40), కె.అశోక్ (21), వినోద్‌కుమార్ (39), వి.రవి (32), వి. హన్మంతు (26), బి.అనీల్‌కుమార్‌రెడ్డి (29), కె.శేఖర్‌రెడ్డి (33), కె.శ్రీనివాస్ (29)లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి నగదు, 8 సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు. వీరందరినీ పేట్ బషీరాబాద్ పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గతంలో వీరిపై క్రికెట్ బెట్టింగ్‌ల కేసులు ఉన్నాయా.. అడ్డాలు మార్చి ఎంత కాలం నుంచి బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మోసాలకు, బెట్టింగ్‌లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునే దిశగా సైబరాబాద్ సీపీ సీవీ ఆనంద్ రంగం సిద్ధం చేసినట్లు సమాచారం.

>
మరిన్ని వార్తలు