జలవిహార్ వద్ద మృతదేహం కలకలం

20 Jul, 2016 14:18 IST|Sakshi
రక్తపు మరకలతో కనిపించిన గోనెసంచి

హైదరాబాద్: నగరంలోని నక్లెస్ రోడ్డుకు దగ్గరలోని జలవిహార్ వద్ద బుధవారం గోనెసంచి కలకలం సృష్టించింది. రైల్వే లైనుకు పక్కనే ఉన్న పొదల్లో పడేసి ఉన్న గొనేసంచి నుంచి దుర్వాసన రావడం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దాంతో ఆ ప్రాంతానికి చేరుకున్న పోలీసులు గోనె సంచి మీద ఉన్న రక్తపు మరకలను చూసి.. మృతదేహం ఉన్నట్లుగా అనుమానించారు.

కొద్దిసేపటికి సంచి నుంచి బీప్ శబ్దం వస్తుండటంతో డాగ్, బాంబ్ స్క్వాడ్ లకు సమాచారం అందించారు. ఘటనా ప్రాంతానికి చేరుకున్న డాగ్, బాంబ్ స్క్వాడ్ లు తనిఖీలు నిర్వహించి సంచిలో చుట్టి పడేసిన కుక్క మృతదేహాన్ని గోనెసంచి నుంచి బయటకు తీశాయి. గుర్తుతెలియని వ్యక్తులు రాట్ విలర్ జాతికి చెందిన ఆడ కుక్కను చంపి పొదల్లో పడేసినట్లు చెప్పారు. కాగా, రాట్ విలర్ జాతికి చెందిన కుక్కల విలువ రూ.10వేల నుంచి రూ. 1.35 లక్షల వరకు కూడా ఉంటుంది. ఈ కుక్కను ఎవరో కిడ్నాప్ చేసి, తీసుకొచ్చి చంపేసినట్లు తెలుస్తోంది. ఎవరో పెంచుకుంటున్న కుక్క అని స్పష్టంగా తెలుస్తోంది.

మృతదేహం కనపడటంతో శునకాలతో పోలీసుల తనిఖీ


జలవిహార్ ప్రాంతంలో బయటపడిన రాట్ వీలర్ శునకం కళేబరం
 

మరిన్ని వార్తలు