- ఏడు నెలల చిన్నారి కడుపులో పిండం
- శస్త్రచికిత్స చేసి తొలగించిన నియో బీబీసీ వైద్యులు
- పాప ఆరోగ్యంగా ఉందని, భవిష్యత్లో ఏ ఇబ్బంది ఉండదని వెల్లడి
- ఐదు లక్షల మందిలో ఒకరికి ఇలా జరిగే అవకాశం
హైదరాబాద్: ఏడు నెలల శిశువు కడుపులో మరో శిశువు పెరుగుతున్న అత్యంత అరుదైన ఘటన నిజామాబాద్ పట్టణంలో చోటు చేసుకుంది. విద్యానగర్లోని నియో బీబీసీ ఆస్పత్రి వైద్యులు ఆ పాపకు శస్త్రచికిత్స చేసి పిండాన్ని విజయ వంతంగా తొలగించారు. ప్రస్తుతం చిన్నారి పూర్తి ఆరోగ్యంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ వివరాలను శనివారం నియో బీబీసీ వైద్యులు డాక్టర్ రంగయ్య, నరేంద్రకుమార్ విలేకరులకు తెలియజేశారు. నిజామాబాద్ పట్టణానికి చెందిన దంపతులకు ఏడు నెలల పాప ఉంది. ఇద్దరూ ఉద్యోగస్తులు కావడంతో పాపను నిజామాబాద్లోనే ఉంటున్న నానమ్మ దగ్గర సంరక్షణ నిమిత్తం ఉంచారు.
రెండు నెలల నుంచి పాప విపరీతంగా ఏడుస్తోంది. తమకు దూరంగా ఉండటం వల్లే ఏడుస్తోందని భావించిన తల్లిదండ్రులు చిన్నారిని తమ దగ్గరకు తెచ్చుకున్నారు. అయినా పాప ఏడుపు ఆపకపోవడంతో నిజామా బాద్లో చిన్నపిల్లల వైద్యుడు రామ్మోహన్కు చూపించగా.. స్కానింగ్ తీసిన ఆయన కడుపులో గడ్డ మాదిరిగా ఉందని నియో బీబీసీ ఆస్పత్రికి రిఫర్ చేశారు. ఈ నెల 15న పాపను ఆస్పత్రిలో చేర్చగా.. పిడియాట్రిక్ సర్జన్ నరేంద్రకుమార్, మరో వైద్యుడు వెంకటేశ్వర్లు పాపను పరీక్షిం చారు. మరోసారి స్కానింగ్ తీయగా అందులో తల, కాళ్లు, చేతులు, జుట్టుతో శిశువు మాదిరిగా పిండం ఉందని గుర్తించారు. అయితే పాప కడుపులో పిండం తయారవుతోందని నిర్ణయానికి వచ్చినా తల్లిదండ్రులకు తెలియ జేయలేదు.
16వ తేదీన పాపకు రెండు గంటల పాటు ఆపరేషన్ చేసి అప్పుడే రూపుదిద్దు కుంటున్న పిండాన్ని బయటికి తీశారు. పాప బరువు 6 కేజీల 700 గ్రాములు ఉండగా.. కడుపులోని పిండం బరువు 100 గ్రాములు ఉంది. అయితే ఈ పిండం గర్భంలో కాకుండా కడుపులో ఉందని, కాబట్టి పాపకు భవిష్యత్లో ఏ ఇబ్బంది ఉండదని వైద్యులు రంగయ్య, నరేంద్రకుమార్ తెలిపారు. ఐదు లక్షల మంది శిశువుల్లో ఒకరికి ఇలా జరిగే అవకాశం ఉందని, మనదేశంలో తొలిసారిగా 1999లో నాగపూర్కు చెందిన సంజు భగత్(36) కడుపులో ఇదే విధంగా పిండం తయారయ్యిందని వైద్యులు చెప్పారు. ఆ తర్వాత కజకిస్తాన్, పాకిస్తాన్, అమెరికా, చైనా తదితర దేశాల్లో ఇలాంటి సంఘటనలు జరిగాయన్నారు.