రుణ వేదన!

23 Feb, 2016 23:43 IST|Sakshi

గ్రేటర్‌లో 6,357  ఉపాధి యూనిట్లు...
16 వేల మంది దరఖాస్తులు
మంజూరైన నిధులు రూ.45 కోట్లు
ఎంపికలో అధికారులపై ఒత్తిడి

 
సిటీబ్యూరో:   జిల్లాలో ఎస్సీ, బీసీ, గిరిజన, మైనారిటీ, వికలాంగుల కార్పొరేషన్ల ద్వారా అర్హులైన పేదలకు వివిధ ఉఫాధి పథకాల కింద సబ్సిడీ రుణాల పంపిణీపై యంత్రాంగం కసరత్తు చేస్తున్నది. లబ్ధిదారుల ఎంపిక కోసం దరఖాస్తుల పరిశీలన జనవరిలోనే పూర్తి చేసిన ఆయా కార్పొరేషన్లు సబ్సిడీ మొత్తాన్ని ఫిబ్రవరి నెలాఖరు వరకు విడుదల చేయటానికి చర్యలు చేపడుతున్నాయి. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు ముగియటంతో సబ్సిడీ రుణం పంపిణీ యూనిట్లపై అధికారులు దృష్టి పెట్టారు. బ్యాంకు కాన్‌సెంట్ అందజేసిన లబ్ధిదారులకు మార్చి నెలాఖరు నాటికి  సబ్సిడీ రుణానికి సంబంధించిన ఉఫాది యూనిట్లు గ్రౌండింగ్ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు.
 
పెరిగిన ఒత్తిడి...
గ్రేటర్‌లో ఎస్సీ, బీసీ, ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా 6,357 యూనిట్లకు ప్రభుత్వం రూ.45 కోట్లు మంజూరు చేసింది. సబ్సిడీ శాతాన్ని భారీగా పెంచటంతో రుణం కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య 16 వేలు దాటింది. దీంతో అధికారులపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. ఈమేరకు అధికారులు కూడా యూనిట్ల సంఖ్యను పెంచి, అదనపు నిధులు విడుదల చేయాలని ఇటీవల జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. వివిధ కార్పొరేషన్ల అధికారులు, దీనికి సంబధించిన ప్రతిపాదనలు చేశారు. అయినా ..ఇప్పటి వరకు సర్కారు నుంచి స్పందన రాకపోగా, ఇచ్చిన నిధులనే సర్దుబాటు చేయాలని పేర్కొంది. కార్పొరేషన్లకు అందిన దరఖాస్తుల సంఖ్యకు అనుగుణంగా యూనిట్ల సంఖ్యను పెంచి ...సరిపడు నిధులను ప్రభుత్వం ఇవ్వని పక్షంలో లబ్ధిదారులను సంతృప్తి పరచటం కష్టమేనని అధికారులు అంటున్నారు. బీసీ కార్పొరేషన్లకు మాత్రం తగినంత బడ్జెట్ విడుదల కాకపోవటంతో ఆ శాఖ అధికారులు దరఖాస్తుదారుల నుంచి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.

ఇదిలా ఉండగా ఇప్పటి వరకు మంజూరైన యూనిట్ల సంఖ్యకు అనుగుణంగా  లబ్ధిదారుల ఎంపికపై  హైదరాబాద్ జిల్లా అధికారయంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్‌కు 2015-16 సంవత్సరానికిగానూ  1581 యూనిట్ల లక్ష్యాన్ని నిర్దేశించగా, 788 దరఖాస్తులకు బ్యాంకులు కాన్‌సెంట్ ఇవ్వగా, 510 యూనిట్లకు మంజూరీ ఇచ్చారు. 500 వృత్తి నైపుణ్యం కలిగిన లబ్ధిదారుల ఎంపిక లక్ష్యం కాగా,  370 యూనిట్లు  మంజూరీ చేశారు. గిరిజన సంక్షేమ కార్పొరేషన్‌కు 73 యూనిట్లు లక్ష్యంగా నిర్దేశించగా, 84 దరఖాస్తు రాగా ఎంపికపై దృష్టి పెట్టారు.  బీసీ సంక్షేమ కార్పొరేషన్‌కు 740 యూనిట్లు లక్ష్యం కాగా, 400 యూనిట్లు మంజూరు చేశారు. వికలాంగుల శాఖకు 24 యూనిట్లు లక్ష్యం కాగా, 35 మందిని అర్హులుగా గుర్తించి, 10 యూనిట్లు మంజూరీ ఇచ్చిన అధికారయంత్రాంగం సబ్సిడీ రుణానికి సంబంధించిన ఉపాధి యూనిట్ల గ్రౌండింగ్‌పై చర్యలు తీసుకుంటున్నది.
 

మరిన్ని వార్తలు