జీఎస్టీ డీలర్ల పంపకాలు పూర్తి!

4 Jan, 2018 03:29 IST|Sakshi

     సెంట్రల్‌ ఎక్సైజ్, రాష్ట్ర పన్నుల శాఖల మధ్య ఒప్పందం 

     1.5 లక్షల మంది రాష్ట్రానికి, 33 వేల మంది కేంద్రం పరిధిలోకి..

సాక్షి, హైదరాబాద్‌: వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) అమలులో కీలక ఘట్టం ముగిసింది. ఇన్నాళ్లూ జీఎస్టీ కట్టాల్సిన డీలర్ల(వ్యాపారులు) నుంచి ఏ శాఖ పన్ను వసూలు చేయాలో అర్థం కాని పరిస్థితులు ఉండగా, ఇప్పుడు ఈ సమస్య పరిష్కారమైంది. ఈ అంశానికి సంబంధించి సెంట్రల్‌ ఎక్సైజ్, రాష్ట్ర పన్నుల శాఖల మధ్య ఒప్పందం కుదిరింది. రాష్ట్ర వ్యాప్తంగా జీఎస్టీ పరిధిలోకి వస్తున్న 1.83 లక్షల మంది డీలర్ల పంపిణీ ప్రక్రియలో భాగంగా 33 వేల మందిని సెంట్రల్‌ ఎక్సై జ్‌కు, 1.5 లక్షల మందిని పన్నుల శాఖకు కేటాయించారు. ఉన్నతాధికారులు ఆమోదముద్ర వేశారు. 

లాటరీ పద్ధతిన ఎంపిక..: జీఎస్టీ కింద పన్ను చెల్లించేందుకు రాష్ట్రంలో 2.5 లక్షల మంది రిజిస్టర్‌ చేసుకున్నారు. ఇందులో 1.6 లక్షల మంది వ్యాట్‌ నుంచి జీఎస్టీకి బదిలీ కాగా, మరో 90 వేల మంది కొత్తగా జీఎస్టీ కింద రిజిస్టర్‌ చేసుకున్నారు.  వ్యాట్‌ పరిధిలో రిజిస్టర్‌ అయిన డీలర్లంతా (సర్వీసు ట్యాక్స్‌ చెల్లించే డీలర్లు మినహా) పన్నుల శాఖ పరిధిలోకి వచ్చేవారు. కానీ, జీఎస్టీ నిబంధనల ప్రకారం వార్షిక టర్నోవర్‌ 1.5 కోట్ల లోపు ఉన్న డీలర్లలో 90 శాతం మందిని పన్నుల శాఖ, 10 శాతం మందిని సెంట్రల్‌ ఎక్సైజ్‌ శాఖ పర్యవేక్షించాలి. రూ.1.5 కోట్ల కన్నా ఎక్కువ వ్యాపారం చేసే డీలర్లలో చెరో 50 శాతం పంచుకోవాల్సి ఉంటుంది. అందులో భాగంగా ఇరుపక్షాలు డీలర్లను పంచుకునేందుకు 1,83,327 మంది డీలర్లను పరిగణనలోకి తీసుకున్నారు.

ఇందులో 1.5 కోట్ల కన్నా ఎక్కువ టర్నోవర్‌ ఉన్న 36,830 మందిలో 18,414 మందిని సెంట్రల్‌ ఎక్సైజ్‌కు, 18,416 మంది రాష్ట్ర పన్నుల శాఖకు కేటాయించారు. రిజిస్ట్రేషన్‌ ప్రకారం ఒకటో నంబర్‌ డీలర్‌ ను రాష్ట్ర పన్నుల శాఖకు, రెండో నంబర్‌ డీలర్‌ను సెం ట్రల్‌ ఎక్సైజ్‌కు కేటాయించారు. 1.5 కోట్ల కన్నా తక్కువ టర్నోవర్‌ ఉన్న 1,46,497 మంది డీలర్లలో 14,649 సెంట్రల్‌ ఎక్సైజ్‌లోకి, 1,31,848 మంది రాష్ట్ర పన్నుల శాఖ పరిధిలోకి తెచ్చారు. 10 మంది డీలర్లను తీసుకుని, 8వ నంబర్‌ను సెంట్రల్‌ ఎక్సైజ్‌ శాఖకు కేటాయించారు. 10 మంది డీలర్ల చొప్పున విభజించి లాటరీ పద్ధతిన పంపిణీ ప్రక్రియను పూర్తి చేశారు. కాగా, జీఎస్టీ అమల్లోకి వచ్చిన ఆరునెలలకు పూర్త యిన ఈ ప్రక్రియపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పర్యవేక్షణకు అధికారిక ఆమోదముద్ర లభించనుంది. 

మరిన్ని వార్తలు