ఉప రాష్ట్రపతి పదవికి పోటీపై గవర్నర్
- అదంతా మీడియా సృష్టేనని వ్యాఖ్య
- రాజ్భవన్లో ఇఫ్తార్ విందు
- సీఎం కేసీఆర్ సహా ప్రముఖుల హాజరు
- వైజాగ్లో ఉన్నందుకే బాబు రాలేదు
- కేఈని పంపారు: నరసింహన్
సాక్షి, హైదరాబాద్: ‘‘ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేయాలని నేను నిర్ణయం తీసుకోలేదు. అదంతా మీడియా సృష్టి. దేవుడు ఏదీ తలిస్తే అదే జరుగుతుంది’’ అని తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ వ్యాఖ్యానించారు. రంజాన్ ఉపవాసాల సందర్భంగా బుధవారం రాజ్భవన్లో ఆయన ఇఫ్తార్ విందు ఇచ్చారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు, ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ ముందస్తుగా రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ఇది చాలా మంచి మాసం. మనసులోని చెడు భావాలను దూరం చేసి, మలినం లేకుండా పవిత్రంగా ఉంచే మాసం. ఉపవాసంతో మంచితనం, సంస్కారం అలవడతాయి. ముస్లింలు ద్వేష భావాన్ని వీడాలి.
చెడు గురించి ఆలోచించొద్దు. ఎవరికీ కీడు చేయొద్దు. దేవుడిని ప్రార్థిస్తూ మంచితనంతో మసలుకోవాలి. పరస్పర సోదర భావం పెంచుకొని మంచి నడవడికతో జీవించాలి. జీవితంలో పది మందికి మేలు చేయాలి. సత్ప్రవర్తన, మంచితనం అలవర్చు కోవాలి’’ అని కోరారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖపట్నంలో ఉండటం వల్లే విందుకు రాలేకపోయారన్నారు. అందుకే కేఈని పంపారని చెప్పారు. విందు ముగింపు సందర్భంగా మీడియాతో చిట్చాట్లో పలు ప్రశ్నలకు గవర్నర్ బదులిచ్చారు. తాను ఎవరికీ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదన్న ప్రచారం అవాస్తవమన్నారు.
‘‘మంగళవారం టీడీపీ నేతలు వచ్చి కలిశారు. గురువారం కాంగ్రెస్ నేతలు కలవనున్నారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి ఇఫ్తార్ విందుకు ఎందుకు రాలేదో గురువారం నన్ను కలవడానికి వచ్చిప్పుడు ప్రశ్నిస్తా’’ అని సరదాగా అన్నారు. విందులో మాజీ ముఖ్యమంత్రులు నాదెండ్ల భాస్కరరావు, కె.రోశయ్య, మండలి చైర్మన్ స్వామి గౌడ్, స్పీకర్ కె.మధుసూదనాచారి, విపక్ష నేత కె.జానారెడ్డి, మండలిలో విపక్ష నేత షబ్బీర్ అలీ, ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, మంత్రులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఈటల రాజేందర్, కేటీఆర్, నాయిని నర్సింహారెడ్డి, ఇంద్రకరణ్రెడ్డి, మహేందర్రెడ్డి, చందూలాల్, ఎంపీ కే కేశవరావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు.
రోశయ్యకు సీఎం ప్రత్యేక పలకరింపు
ఇఫ్తార్ విందులో కేసీఆర్ మాజీ సీఎం కె.రోశయ్య దగ్గరికి వెళ్లి ప్రత్యేకంగా పలకరించారు. రోశయ్య పక్కన కూర్చొని కొద్ది నిమిషాలు మాట్లాడారు. ఆయన ఆరోగ్యం గురించి వాకబు చేశారు.