ఎయిమ్స్‌ కోసం ఆఖరి ప్రయత్నం!

9 Feb, 2018 01:48 IST|Sakshi

నేడు ఢిల్లీలో కేంద్ర మంత్రి నడ్డాను కలవనున్న మంత్రి లక్ష్మారెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రానికి రావాల్సిన అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్‌) దోబూచులాటకు తెరపడుతోంది. దాదాపు నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉన్న కేంద్రం నిర్ణయంపై స్పష్టత రానుంది. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి కేంద్రానికి విన్నవిస్తున్నా ఎయిమ్స్‌పై స్పందన లేకపోవడం, తాజా కేంద్ర బడ్జెట్‌లోనూ ఆ ఊసే ఎత్తకపోవడంతో.. కేంద్ర ఆరోగ్య మంత్రి జె.పి.నడ్డాను స్వయంగా కలసి మరోసారి విన్నవించేందుకు వైద్యారోగ్య శాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి శుక్రవారం ఢిల్లీకి వెళ్తున్నారు.  

రాజకీయ నిర్ణయం మినహా..
ఎయిమ్స్‌ను యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌ క్యాంపస్‌లో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. ఎయిమ్స్‌ మంజూరుకు అవసరమైన అన్ని వసతులు ఉన్నాయని పేర్కొంది. కేంద్ర ఆరోగ్య శాఖ సైతం ఇదే అభిప్రాయంతో ఉంది. రాజకీయ నిర్ణయం మినహా ఇతర సమస్యలేవీ లేవని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రీతి సుడాన్‌ కూడా ఇటీవలి రాష్ట్ర పర్యటన సందర్భంగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎయిమ్స్‌పై కేంద్రం నుంచి రాజకీయ నిర్ణయం వెలువడేలా ఒత్తిడి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఎయిమ్స్‌ కోసం ఇదే ఆఖరి ప్రయత్నమని వైద్య శాఖ వర్గాలు చెబుతున్నాయి.

మరిన్ని వార్తలు