అడ్డొస్తే అడ్డంగా నరికేస్తా

10 Apr, 2017 06:26 IST|Sakshi
అడ్డొస్తే అడ్డంగా నరికేస్తా

ఎమ్మెల్యే రాజాసింగ్‌ రామ మందిర నిర్మాణంపై వివాదాస్పద వ్యాఖ్యలు

హైదరాబాద్‌: ‘అయోధ్యలో రామమందిరం నిర్మించి తీరుతాం.. ఎవరైనా అడ్డొస్తే అడ్డంగా నరికేస్తా.. రామాలయ నిర్మాణంలో ప్రాణాలు అర్పించడానికైనా.. తీయడానికైనా ఏ మాత్రం వెనుకాడబోను’ అని గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 5న శ్రీరామనవమి రోజు ఎమ్మెల్యే రామభక్తులను ఉద్దేశించి ధూల్‌పేట్‌ జుమ్మెరాత్‌బజార్‌లో ప్రసంగించిన వీడియో ఆదివారం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. అంతేగాక పలు మీడియా చానెళ్లు ఈ వీడియోను ప్రసారం చేయడంతో రాజాసింగ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు మరోసారి తెరపైకి వచ్చాయి.

ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై ‘సాక్షి’వివరణ కోరగా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ హయాంలో త్వరలోనే రామ మందిరం నిర్మాణం ప్రారంభిస్తామన్నారు. ఎవరైనా అడ్డువస్తే వారి ప్రాణాలు తీసేందుకు వెనుకాడబోనన్నారు. రామమందిరం నిర్మాణం ఆపడం ఇక ఎవరితరం కాదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. హిందుస్తాన్‌లో హిందువులకు వ్యతిరేకంగా ఉండేవారికి స్థానంలేదని స్పష్టం చేశారు. కాగా అనుచిత వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్‌పై డబీర్‌పురా పోలీసులు ఆదివారం రాత్రి కేసు నమోదు చేశారు. ఎంబీటీ అధికార ప్రతినిధి అంజదుల్లా ఖాన్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఇన్స్‌పెక్టర్‌ వెంకన్ననాయక్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు