రూ.300 కోట్లతో అత్యాధునిక స్టూడియో

30 Nov, 2013 04:50 IST|Sakshi

=3న కేబినెట్ సమావేశంలో నిర్ణయం
 =మంత్రి పొన్నాల వెల్లడి
 =ఘనంగా పద్మమోహన ఆర్ట్స్ అవార్డుల ప్రదానం

 
సాక్షి,సిటీబ్యూరో: రాష్ట్రంలో యానిమేషన్, గేమింగ్ సెంటర్ ఏర్పాటులో భాగంగా రూ.300 కోట్ల వ్యయంతో 30 ఎకరాల్లో రాయదుర్గం వద్ద అత్యాధునిక పరిజ్ఞానంతో కూడిన ఓ స్టూడియో త్వరలో నిర్మించనున్నట్లు ఐటీశాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. శుక్రవారం రవీంద్రభారతిలో పద్మమోహన ఆర్ట్స్ 23వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బుల్లితెర కళాకారులకు పద్మమోహన టీవీ అవార్డు-2013లను ఆయన అందజేసి మాట్లాడారు.

ఈ స్టూడియోకు సంబంధించి వచ్చేనెల 3న జరిగే కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అలాగే బుల్లితెర కళాకారులకు ఉగాది పురస్కారాలు అందించేలా సీఎంతో మాట్లాడతానని చెప్పారు. సమాచార హక్కు చట్టం కమిషనర్ పి.విజయబాబు మాట్లాడుతూ మంచి-చెడులు రెండింటిని టీవీ రంగం ప్రభావితం చేస్తోందని పేర్కొన్నారు. ప్రతి కళాకారుడి చరిత్రలో చీకటిపుటలు ఎన్నో ఉంటాయని తెలిపారు. ఏఐసీసీ కార్యద ర్శి పొంగులేటి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ ఫిల్మ్‌నగర్‌లాగా టీవీ కళాకారులకు అన్ని సౌకర్యాలతో టీవీనగర్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరముందన్నారు.

ఈ సందర్భంగా నిర్వహించిన మిమిక్రీ, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం ‘సాక్షి’ నుంచి బెస్ట్ న్యూస్‌రీడర్‌గా హరి, మాటీవీ నుంచి బెస్ట్ కామెడీయన్‌గా మల్లికతోపాటు టీవీ రంగానికి చెందిన మరో 41 మంది ఆర్టిస్టులకు పద్మమోహన్ అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యదర్శి అర్వింద్‌కుమార్‌గౌడ్, సినీనటి కవిత, శివశక్తి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండీ ఎన్‌ఎస్ రావు, వైష్ణవీ ఇంద్రకాన్ ఇండియా లిమిటెడ్ ఎండీ పాండురంగారెడ్డి, పద్మమోహన్ ఆర్ట్స్ ఫౌండర్ డి.యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు