స్టీమ్‌బాత్‌కు వెళ్లి వచ్చేలోగా గొలుసు మాయం

3 Sep, 2014 08:25 IST|Sakshi
స్టీమ్‌బాత్‌కు వెళ్లి వచ్చేలోగా గొలుసు మాయం

హైదరాబాద్ :  కొండ నాలుకకు మందువేస్తే ఉన్న నాలుక ఊడినట్లు ......బరువు తగ్గేందుకు ఫిట్‌నెస్ సెంట ర్‌కు వస్తే అక్కడి సిబ్బంది బంగారు గొలుసు చోరీ చేశారని ఆరోపిస్తూ ఓ మహిళ శ్రీనగర్‌కాలనీలో కలర్స్ ఫిట్‌నెస్ సెంటర్ వద్ద మంగళవారం ఆందోళన నిర్వహించింది. బాధితురాలి కథనం ప్రకారం.. ఇందిరానగర్ నివాసి టి.కావ్య బరువు తగ్గే చికిత్స నిమిత్తం గతనెల 26న సదరు ఫిట్‌నెస్ సెంట ర్‌కు వెళ్లింది. చికిత్స అనంతరం స్టీమ్‌బాత్‌కు వెళ్తూ నాలుగు తులాల బంగారు గొలుసును బ్యాగ్‌లో ఉంచి టేబుల్‌పై పెట్టింది. పది నిమిషాల అనంతరం తిరిగి వచ్చి చూడగా బ్యాగ్‌లోని గొలుసు కనిపించలేదు.

మీ గొలుసు పోవడానికి మేమే కారణం. సెటిల్‌మెంట్ చేసుకుందాం రండి అని ఫిట్‌నెస్ సెంటర్ నిర్వాహకుడు పిలిచాడు. మరుసటి రోజు ఆమె వెళ్లగా... పోలీసు ఉన్నతాధికారులు నా కస్టమర్లు, నన్ను నువ్వు ఏమీ చెయ్యలేవు అని బెదిరించాడు. దీంతో ఆమె పంజగుట్ట క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అయితే ఇప్పటి వరకు సదరు సంస్థపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో బాధితురాలు తన బంధువులతో కలిసి  మంగళవారం కలర్స్ ఫిట్‌నెస్ సెంటర్ ముందు ఆందోళన నిర్వహించింది.

మరిన్ని వార్తలు