ప్రతిపక్ష నేతకు మూడేళ్ల జైలు శిక్ష

31 Oct, 2019 09:24 IST|Sakshi

చిట్టగాంగ్ కోర్టు సంచలన తీర్పు

చిట్టగాంగ్: బంగ్లాదేశ్ ప్రతిపక్ష పార్టీ నాయకుడు, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఉపాధ్యక్షుడు గైసుద్దీన్ ఖాదర్ చౌదరికి మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ చిట్టగాంగ్ కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్‌ హసీనాను చంపేస్తానని గత ఏడాది గైసుద్దీన్ ఖాదర్ చౌదరి బెదిరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ బెదిరింపు వ్యాఖ్యలపై అధికార ఆవామీ లీగ్ ప్రధాన కార్యదర్శి నిజాముద్దీన్ ముహురీ కోర్టులో కేసు వేశారు. దీనిపై విచారించిన చిట్టాగాంగ్‌ కోర్టు.. ఆరోపణలు నిజమేనని రుజువుకావడంతో గత ఏడాది మే 31వతేదీన గైసుద్దీన్ అరెస్టుకు వారంట్ జారీ చేసింది. తాజాగా తుది తీర్పును వెలువరించిన ధర్మాసనం.. సాక్షాత్తూ ప్రధానమంత్రిని చంపేస్తానని బెదిరించిన గైసుద్దీన్ కు మూడేళ్ల జైలు శిక్షతోపాటు ఐదువేల బంగ్లాదేశీ టాకాలను జరిమానాగా చెల్లించాలని తీర్పులో పేర్కొంది. జరిమానా చెల్లించకుంటే మరో మూడు నెలల అదనపు జైలు శిక్ష అనుభవించాలని కోర్టు తెలిపింది.
 

మరిన్ని వార్తలు