హాంకాంగ్‌పై మరింత పట్టు

29 May, 2020 04:57 IST|Sakshi

జాతీయ భద్రతా బిల్లుకు చైనా పార్లమెంట్‌ ఆమోదం

బీజింగ్‌: హాంకాంగ్‌పై మరింత పెత్తనం చెలాయించేందుకు ఉద్దేశించిన వివాదాస్పద జాతీయ భద్రతా బిల్లును చైనా పార్లమెంట్‌ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇవి అమల్లోకి వస్తే హాంకాంగ్‌ ప్రాదేశిక స్వతంత్ర ప్రతిపత్తి, పౌరులకున్న రాజకీయ స్వేచ్ఛ, ప్రాథమిక హక్కులు ప్రమాదంలో పడతాయని విమర్శకులు అంటున్నారు. ప్రధాన వాణిజ్య కేంద్రాల్లో ఒకటిగా హాంకాంగ్‌కున్న పేరు మరుగున పడుతుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

చైనా ప్రభుత్వం రూపొందించిన ఈ ప్రతిపాదనలను నామమాత్రంగా ఉండే పార్లమెంట్‌(నేషనల్‌ పీపుల్స్‌ కాంగ్రెస్, ఎన్‌పీసీ) ఏకగ్రీవంగా ఆమోదించింది. వీటిని హాంకాంగ్‌ పార్లమెంట్‌ ఆమోదిస్తే వచ్చే ఆగస్టు కల్లా చట్టరూపం దాల్చుతుంది.  ప్రజాస్వామ్య హక్కులు, చైనా నుంచి మరింత స్వతంత్ర ప్రతిపత్తి కోసం గత ఏడాది ప్రజాస్వామ్య వాదులు చేపట్టిన ఆందోళనలతో హాంకాంగ్‌ అట్టుడికింది. తీవ్ర హింసాత్మక ఘటనలు చెలరేగాయి. వాణిజ్య కార్యకలాపాలు స్తంభించాయి. ఈ పరిణామాలను చైనా ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. హాంకాంగ్‌పై మరింత పట్టు సాధించడం ద్వారా వీటికి చెక్‌ పెట్టాలని నిర్ణయించుకుంది.

మరిన్ని వార్తలు