ఓటేసిన అంతర్జాతీయ ఉగ్రవాది

25 Jul, 2018 14:58 IST|Sakshi
ఓటేస్తున్న హఫీజ్‌ సయీద్‌

లాహోర్‌, పాకిస్తాన్‌ : అందరూ చూస్తుండగానే ఓ అంతర్జాతీయ ఉగ్రవాది ఓటేశాడు. బుధవారం పాకిస్తాన్‌ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా లాహోర్‌లోని ఓ ఓటింగ్‌ కేంద్రానికి వెళ్లిన  26/11 ముంబై దాడుల సూత్రధారి, లష్కర్‌-ఈ-తోయిబా(ఎల్‌ఈటీ), జైష్‌-ఈ-మొహమ్మద్ ఉగ్ర సంస్థల చీఫ్‌‌ హఫీజ్‌ సయీద్‌ ఓటు వేశాడు. ముంబై ఉగ్రదాడి వెనుక హఫీజ్‌ సయీద్‌ ఉన్నాడని నిర్ధారించిన అమెరికా 2012 అతన్ని పట్టించిన వారికి 10 మిలియన్‌ డాలర్ల అవార్డును ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ ఎన్నికల్లో సయీద్‌ ఓటు వేసేందుకే పరిమితం కాలేదు. అతనికి చెందిన 200 మంది అభ్యర్థులు ఎన్నికల్లో తలపడుతున్నారు. గతేడాది ఆగష్టులో సయీద్‌ మిల్లీ ముస్లిం లీగ్‌(ఎమ్‌ఎమ్‌ఎల్‌) పేరుతో రాజకీయ పార్టీని ప్రారంభించడానికి ప్రయత్నించాడు. అయితే, అమెరికాతో పాటు పలు దేశాలు దీన్ని ముక్తకంఠంతో ఖండించాయి. అంతర్జాతీయ ఒత్తిడికి తలొగ్గిన పాకిస్తాన్‌ అతని పార్టీకి గుర్తింపు ఇవ్వలేమని పేర్కొంది. అయినా ఎలాంటి ఒత్తడికి గురవని సయీద్‌ అతి సునాయాసంగా తన అభ్యర్థులను అల్లా-ఓ-అక్బర్‌ తెహ్రీక్‌(ఏఏటీ) ద్వారా బరిలో నిలిపాడు.

పాకిస్తాన్‌ ఎన్నికల్లో పార్లమెంట్‌లోని 272 స్థానాలకు 3,459 మంది అభ్యర్థులు పోటీపడుతుండగా.. 4 రాష్ర్టాల అసెంబ్లీలోని 577 స్థానాలకు 8,396 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఇమ్రాన్‌ ఖాన్‌కు చెందిన పాకిస్థాన్ తెహ్రీక్ ఇన్సాఫ్, పాకిస్థాన్ ముస్లిం లీగ్‌కు మధ్య హోరాహోరీ పోటీ ఉంటుందని సర్వేలు వెల్లడించాయి.

>
మరిన్ని వార్తలు