అమెరికాలో 400 మందికి కుచ్చుటోపీ

1 Feb, 2019 03:50 IST|Sakshi

రూ.5.59 కోట్లు మోసం చేసిన అమ్మిశెట్టి కిశోర్‌  

వాషింగ్టన్‌: అమెరికా బ్యాంకింగ్‌ వ్యవస్థలో చిన్న లోపాన్ని గుర్తించిన ఓ భారతీయ యువకుడు భారీ మోసానికి తెరలేపాడు. దాదాపు 400 మంది భారత సంతతి వ్యక్తులకు రూ.5.59 కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టాడు. దీంతో నిందితుడిని జనవరి 25 అరెస్ట్‌ చేసిన పోలీసులు కనక్టికట్‌లోని ఓ కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించారు. 2013లో కిశోర్‌బాబు అమ్మిశెట్టి(30) అనే వ్యక్తి అమెరికాకు స్టూడెంట్‌ వీసాపై వచ్చాడు. ఇక్కడి బ్యాంకులు పాటించే ప్రొవిజినల్‌ క్రెడిట్‌ విధానం కిశోర్‌ను ఆకర్షించింది. దీని కింద నగదు చెల్లింపులు జరిగినా రిజిస్టర్‌ కాకపోతే బ్యాంకులు ఆ మొత్తాన్ని కస్టమర్ల ఖాతాకు జమచేస్తాయి.

ఈ నేపథ్యంలో వస్తువుల అమ్మకం, అద్దె ఇళ్లు ప్రకటనలు ఇచ్చే భారత సంతతి వారిని కిశోర్‌ టార్గెట్‌ చేసుకున్నాడు. వారి బ్యాంక్‌ అకౌంట్‌ వివరాలను తెలుసుకుని.. ఆ బ్యాంకుకు ఫోన్‌ చేసి కస్టమర్‌గా నటించేవాడు. తన ఖాతాకు డబ్బులు పంపినా ఇంకా రిజిస్టర్‌ కాలేదని బుకాయించేవాడు. దీంతో బ్యాంకులు ప్రొవిజినల్‌ క్రెడిట్‌ కింద ఆ మొత్తాన్ని  ఖాతాల్లో డిపాజిట్‌ చేసేవి. అనంతరం ఆ డిపాజిట్‌ దారులకు ఫోన్‌ చేసి పొరపాటున వారి అకౌంట్లలో నగదు జమ చేశానని చెప్పేవాడు.  బాధితులు నిజమని నమ్మి భారీగా నగదును సమర్పించుకున్నారు. ఈ ఖాతాలను  సమీక్షించిన బ్యాంకులు, ఎలాంటి బదిలీలు జరగకపోవడంతో డిపాజిట్‌లను వెనక్కు తీసుకున్నాయి. దీంతో మోసం వెలుగులోకి వచ్చింది.

మరిన్ని వార్తలు